శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (07:09 IST)

పీఎస్‌ఎల్వీ-సీ39 ప్రయోగం విఫలం .. 39 సక్సెస్ ప్రయోగాల తర్వాత

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన నావిగేషన్ బ్యాకప్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ప్రయోగం విఫలమైంది. అంతా సవ్యంగా జరుగుతుందని యావత్ జాతి ఆనందపడుతున్న తరుణంలో కక్ష్యలో ప్రవేశానికి ముందు ఉప్ర

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన నావిగేషన్ బ్యాకప్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ప్రయోగం విఫలమైంది. అంతా సవ్యంగా జరుగుతుందని యావత్ జాతి ఆనందపడుతున్న తరుణంలో కక్ష్యలో ప్రవేశానికి ముందు ఉప్రగహ వాహక నౌక పీఎస్‌ఎల్‌వీ-సీ39 మొరాయించింది. నాలుగోదశలో ఉష్ణకవచం నుంచి ఉపగ్రహం విడిపోకపోవడంతో ప్రయోగం విఫలమైందని ఇస్రో ప్రకటించింది. సాంకేతిక లోపమే కారణమని ఇస్రో ఛైర్మన్ కిరణ్‌ కుమార్ తెలిపారు. లోపంపై సమీక్ష తర్వాతే వివరాలు వెల్లడించగలమని చెప్పారు. 
 
కాగా, ఈ శాటిలైట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి గురువారం రాత్రి ఏడు గంటలకు 8వ నావిగేషన్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ39 రాకెట్ ద్వారా ప్రయోగించారు. బుధవారం రాకెట్ నాలుగోదశలో ద్రవ ఇంధనం నింపిన శాస్త్రవేత్తలు, గురువారం రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపారు. 
 
అనంతరం రాకెట్‌కు తుదివిడత తనిఖీలు నిర్వహించి హీలియం, నైట్రోజన్ గ్యాస్ నింపడం పూర్తిచేశారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసిన తర్వాత 1425 కిలోల బరువైన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి శాటిలైట్ గమనాన్ని పరిశీలిస్తూ వచ్చిన శాస్త్రవేత్తలు చిట్టచివరి దశలో సాంకేతిక లోపం తలెత్తిందని గుర్తించారు. ప్రయోగం విఫలం కావడంతో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు. 
 
24 ఏండ్లుగా జయప్రదంగా 39 పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు ప్రయోగించిన ఇస్రో తాజా వైఫల్యంపై విశ్లేషణలో మునిగింది. చివరిగా 1993 సెప్టెంబర్ 20న ఇస్రో ప్రయోగించిన తొలి ఉపగ్రహం పీఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం కూడా సాంకేతిక కారణాలతోనే విఫలమైంది. అలాగే, 39 విజయవంతమైన ప్రయోగాల తర్వాత ఇస్రో తొలిసారి ఓ విఫల ప్రయోగాన్ని చవిచూసింది.