శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (13:23 IST)

యు.పి.లో గ్యాంగ్: 40 ఏళ్ల మహిళపై దారుణం.. భర్తను, కొడుకును?

యు.పి.లో దారుణం చోటుచేసుకుంది. 40 ఏళ్ల మహిళ యు.పి.లో గ్యాంగ్ రేప్‌కు గురైంది. భర్త, కొడుకును కట్టేసి ఓ మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన అత్యాచారాలకు నిలయమైన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణాలు కొనసాగుతున్నాయని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి.
 
కాగా, తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ(40)పై పది మంది సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి దళిత వర్గానికి చెందిన కుటుంబం పొలం పనులు ముగించుకుని వస్తుండగా పొదల్లో దాక్కొని ఉన్న పది మంది దుండగులు వారిపై ఒక్కసారిగా దాడి చేశారు. ప్రతిఘటించిన బాధితురాలి భర్త, కుమారుడిని కట్టి పడేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
పది మంది నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పి రవీంద్ర గౌడ్ తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత మహిళను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్య నివేదిక వెల్లడించిందని తెలిపారు. 
 
ఘటనపై సమాచారం అందినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోని కంటోన్మెంట్ పోలీసులపై చర్య తీసుకుంటామని ఎస్పి చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.