బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 21 నవంబరు 2020 (11:56 IST)

సెట్ టాప్ బాక్స్ రీచార్జ్ చేస్తానంటూ వచ్చి వైద్యురాలి గొంతు కోసి హతమార్చాడు

ఆగ్రాలో దారుణం జరిగింది. సెట్ టాప్ బాక్స్‌ను రీఛార్జ్ చేయాలనే నెపంతో ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు 38 ఏళ్ల వైద్యురాలిని కత్తితో గొంతు కోసి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే... ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో నిరంతరం రద్దీగా వుండే ప్రాంతమది. ఆ ప్రాంతంలోనే డాక్టర్ నిషా సింఘా తన భర్త, ఇద్దరు పిల్లలతో నివాసం వుంటున్నారు.
 
కాగా శుక్రవారం నాడు ఓ ఆగంతుకుడు డాక్టర్ సింఘాల్ ఇంటిలో దోపిడీ చేయాలని ప్రవేశించాడు. తొలుత కేబుల్ టీవీ సెట్ టాప్ బాక్స్ రీచార్జ్ చేయాలంటూ చెప్పాడు. ఐతే అతడి ప్రవర్తనలో తేడా కనబడటంతో నిషా ప్రతిఘటించారు. దాంతో అతడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతు కోశాడు. ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు పక్క గదిలోనే ఇద్దరు పిల్లలున్నారు. ఒకరికి ఎనిమిదేళ్లు, మరొకరికి నాలుగేళ్లు. వీరిపైన దాడి చేసాడు కానీ హత్య చేయలేదు.
 
ఇంట్లో విలువైన వస్తువులను దొంగిలించేందుకు కనీసం గంటపాటు ఆ ఇంట్లోనే తిరిగాడు. ఐనా ఆ దారుణాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత అతడు దర్జాగా అక్కడి నుంచి పారిపోయాడు. అతడు వెళ్లిన కొద్ది గంటల తర్వాత విధుల్లో వున్న ఆమె భర్త విషయం తెలుసుకుని భార్యను ఆసుపత్రికి తరలించాడు. ఐతే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
 
ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. శాంతిభద్రతలను కాపాడటంలో భాజపా ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని విమర్శించాయి. ఇప్పటికైనా టీవీల్లో తమ గురించి డబ్బాలు కొట్టుకోవడం ఆపి ప్రజల గురించి ఆలోచన చేయాలని ట్వీట్ చేసింది. కాగా నిందితుడిని శనివారం పోలీసులు అరెస్టు చేసారు.