శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (09:17 IST)

లష్కర్ చీఫ్‌గా కాశ్మీర్ ఉగ్రవాది? అదే జరిగితే తొలి కాశ్మీరీగా రికార్డు

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ) చీఫ్‌గా కాశ్మీర్‌కు చెందిన స్థానిక ఉగ్రవాది జీనత్-ఉల్-ఇస్లాం నియమితులుకానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ) చీఫ్‌గా కాశ్మీర్‌కు చెందిన స్థానిక ఉగ్రవాది జీనత్-ఉల్-ఇస్లాం నియమితులుకానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. లష్కర్ టాప్ కమాండర్ అబు ఇస్మాయిల్ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆయన స్థానంలో జీనత్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆయనకే కనుక ఎల్‌ఈటీ పగ్గాలు అందితే తొలి కాశ్మీరీగా రికార్డులకెక్కుతాడు.
 
సోషియాన్ ప్రాంతంలోని సుగాన్ జానిపురాకు చెందిన 28 ఏళ్ల జీనత్‌కు బాంబు (ఐఈడీలు)ల తయారీలో మంచి నైపుణ్యం ఉంది. గతంలో రెండేళ్లపాటు అల్-బద్ర్‌లో పనిచేశాడు. ఇటీవల సోషియాన్‌లో సైనికులపై జరిగిన దాడిలో జీనత్ ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. కాగా, ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో జీనత్ కూడా ఒకడు. 
 
దీంతో జీనత్ లష్కర్ పగ్గాలు అప్పగించడం ఖాయమనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వార్తలను కేంద్ర నిఘా వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయి. తమకు తెలిసినంత వరకు లష్కరే చీఫ్‌గా స్థానికుడెవరూ ఇప్పటివరకు లష్కరే పగ్గాలు చేపట్టలేదని పేర్కొన్నాయి. ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దామని తెలిపాయి.