గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:03 IST)

పాతికేళ్లు సా........గిన బాబ్రీ మసీదు ధ్వంసం కేసు.. వదలని సుప్రీం.. అద్వానీ షాక్

దేశ రాజకీయ, సాంస్కృతిక చట్రాన్నే సమూలంగా మార్చివేసిన బాబ్రీమసీదు కూల్చివేతకు సరిగ్గా పాతికేళ్లు. మసీదు ధ్వంసానికి స్ఫూర్తి ప్రదాతలుగా అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలపై పెట్టిన కుట్రకేసుకు పాతికే

దేశ రాజకీయ, సాంస్కృతిక చట్రాన్నే సమూలంగా మార్చివేసిన బాబ్రీమసీదు కూల్చివేతకు సరిగ్గా పాతికేళ్లు. మసీదు ధ్వంసానికి స్ఫూర్తి ప్రదాతలుగా అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలపై పెట్టిన కుట్రకేసుకు పాతికేళ్లు.. కుట్ర అభియోగాలను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అద్వానీ తదితరులకు భద్రత కల్పించలేకపోయింది. హైకోర్ట్ కొట్టివేసినప్పటికీ వారిపై కుట్ర అభియోగాలను పునరుద్ధరించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను.. జస్టిస్‌ పీసీ ఘోష్, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం స్వీకరించింది. దీంతో బీజేపీ అధినాయకత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ దెబ్బతో బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఇక రాష్ట్రపతి అవుతారో లేదో కానీ బీజేపీపై రాజకీయంగా నీలినీడలు మరో రెండేళ్ల వరకు ఆ పార్టీకి డ్యామేజి చేయడం ఖాయం. 
 
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 1992 నాటి ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషి, ఉమాభారతిపై నేరపూరిత కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది. బాబ్రీ కూల్చి వేతకు వీరు కుట్రపన్నారన్న ఆభియోగాలపై విచారణ కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్ణీత కాలపరిమితితో జరిగే విచారణను అడ్వాణీ, జోషి, ఉమ ఎదుర్కోవాలంది. 
 
లక్నోలోని ట్రయల్‌ కోర్టులో ఈ కేసుపై రోజువారీగా విచారణ జరుగుతుందని, తమ తీర్పు అందిన తర్వాత రెండేళ్ల నిర్ణీత కాలపరిమితిలో కేసు విచారణ ముగించా లని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ‘‘అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించాం. దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు సైతం జారీ చేశాం’’అని ధర్మాసనం పేర్కొంది. రాయ్‌బరేలీ, లక్నో ట్రయల్‌ కోర్టుల్లో వేర్వేరుగా బాబ్రీ కేసుల విచారణ కొనసాగుతోందని, ఇకపై వీటన్నింటినీ కలిపి లక్నోలోని ట్రయ ల్‌ కోర్టులో ఉమ్మడి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. 
 
ఈ వివాదాస్పద కేసులో కొత్తగా విచారణను ప్రారంభించడంలేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు మరోవైపున. లక్నో ట్రయల్‌ కోర్టు న్యాయమూర్తిని విచారణ పూర్తయి తీర్పు వెలువరించే వరకూ బదిలీ చేయరాదని ఆదేశించింది. సరైన కారణం చూపించకుండా ఏ పార్టీ ఈ కేసు వాయిదా కోరేందుకు అవకాశం లేదని, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సంబంధిత కారణాలపై సంతృప్తి చెందితేనే కేసు విచారణ వాయిదా వేయాలని సూచించింది.