ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో గోవధ : గ్రామస్తుల నిరసన
గోవధ నిషేధం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు గోవధ జరిగింది. ఇప్పటికే దాద్రీ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో మరోమారు గోవధ జరగడం గమనార్హం. ఆవును చంపారన్న ఆరోపణల నేపథ్యంలో అల్లరి మూకలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు యూపీలోని మైన్పురి జిల్లా కర్హాల్ ప్రాంతం నాగారియా గ్రామంలో ఓ ఆవును చంపారని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ... రోడ్డు రోకోకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపై ఆందోళనకారులు దాడులకు దిగారు. వాహనాలను తగులబెట్టారు.
పరిస్థితి చేయిదాటిపోవడంతో రంగంలోకి దిగిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ విజయ్ ప్రతాప్, జిల్లా మెజిస్ట్రేట్ చంద్రపాల్ సింగ్ రంగంలోకి దిగారు. గ్రామంలో ఆవును చంపి.. చర్మాన్ని తొలగించి ఉందని చెప్పారు. ఆవును చంపిన వారి గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు.