శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 4 జులై 2017 (08:32 IST)

నగదు రహితం దెబ్బకు బ్యాంకులపైనే నమ్మకం పోయిందా...డిపాజిట్లు లేక అల్లాడుతున్న బ్యాంకులు

నగదు రహితం, పెద్ద నోట్ల రద్దు, ఇప్పుడు తాజాగా జీఎస్టీ అంటూ కేంద్రప్రభుత్వం ఎంత అడ్డగోలు ప్రచారం చేస్తున్నా.. దేశవ్యాప్తంగా ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పూర్తిగా నశించినట్లు స్పష్టటమవుతోంది. ఒకవైపు నగదు రహితం పేరుతో ఆర్బీఐ రాష్ట్రాలకు నగదు పైసా కూడా పంపి

నగదు రహితం, పెద్ద నోట్ల రద్దు, ఇప్పుడు తాజాగా జీఎస్టీ అంటూ కేంద్రప్రభుత్వం ఎంత అడ్డగోలు ప్రచారం చేస్తున్నా.. దేశవ్యాప్తంగా ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పూర్తిగా నశించినట్లు స్పష్టటమవుతోంది. ఒకవైపు నగదు రహితం పేరుతో ఆర్బీఐ రాష్ట్రాలకు నగదు పైసా కూడా పంపించకపోవడం, మరోవైపు డిపాజిట్లు లేక, రాక, ప్రజలు ఆసక్తి చూపక వట్టిపోయిన బ్యాంకులు  ఏటీఎంలలో డబ్బులు పెట్టడం నిలిపివేయడంతో వినియోగదారులకు మళ్లీ నరకం కనిపిస్తోంది. 
 
ఖాతాదారులు బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకుంటున్నారే గాని డిపాజిట్‌ చేయడం లేదు. దీంతో బ్యాంకులో రొటేషన్‌ ఆగిపోయింది. మూడుసార్లకు మించి నగదును డిపాజిట్, విత్‌డ్రాలు  చేస్తే సేవా పన్ను విధిస్తామని బ్యాంకులు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు.
 
నగదు కష్టాల నుంచి గట్టేక్కడానికి నగదు రహితం ఒక్కటే శరణ్యమని అధికారులు చెప్పుకొచ్చారు. బ్యాంకర్లు కూడా దీనినే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే లావాదేవీల్లో ఖాతాదారులు దారుణంగా మోసపోతున్నాడు. స్వైపింగ్‌ ద్వారా కొనుగొలు చేసే ఖాతాదారులకు రూ.100కి రూ.1.20 సర్వీసు ట్యాక్స్‌ పడుతోంది.  మొబైల్‌ బ్యాంకింగ్, నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ వాలెట్‌ ద్వారా చెల్లింపులు చేస్తే కంటికి కనిపించకుండా సర్వీసు చార్జీల పేరుతో నగదు ఖాతాల్లోనుంచి మాయమవుతుండడంతో ప్రజలు నగదు రహితం జోలికి వెళ్లడానికి భయపడుతున్నారు. 
 
నగదు రహితం పేరుతో జూన్‌లో ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పైసా కూడా విదల్చ లేదు. ఫలితంగా బ్యాంకులో నగదు నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం 40 జాతీయ బ్యాంకుల పరిధిలో 596 బ్యాంకు శాఖలున్నాయి. వీటిలో రూ.488.99 కోట్లు మాత్రమే నిల్వ ఉంది. జూలై మొదటి వారంలో బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇలానే కొనసాగితే  రెండు వారాల్లో నగదు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదముంది.
 
కేంద్ర ప్రభుత్వం ఇంత దద్దమ్మ పాలన చేస్తూ దానికి అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు అంటూ పూసిపెట్టడం కొనసాగిస్తే ప్రజలు తమకు అందుబాటులో ఉన్న కాసింత డబ్బును ఇంట్లోంచి బయటకు తీయరన్నది ఖాయం. ఇప్పటికే ఆరోగ్య అవసరాలకోసం మూడు నెలల రిజర్వ్ డబ్బును పెట్టుకోవడం అనేది పోయి కనీసం పది నెలల వరకు డబ్బుకు లోటు లేకుండా తమ వద్దే ఉంచుకోవడం జనం అలవాటు చేసుకుంటున్నారు. ఈ తతంగాన్ని చూస్తుంటే బ్యాంకులకు బదులు జనం డబ్బు దాచుకోవడానికి మళ్లీ లంకె బిందెల్నే ఆశ్రయించినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని ఆర్ధిక రంగ పరిశీలకులు అంటున్నారు.