శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (10:11 IST)

దినకరన్ అరెస్టు తర్వాత కుదిరిన రాజీ... సీఎంగా పళని.. పార్టీ చీఫ్‌గా పన్నీర్

రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ అరెస్టు కావడంతో అన్నాడీఎంకే వైరి వర్గాలు ఏకమయ్యేందుకు రాజీకుదిరింది.

రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ అరెస్టు కావడంతో అన్నాడీఎంకే వైరి వర్గాలు ఏకమయ్యేందుకు రాజీకుదిరింది. ఇదే అంశంపై ఇరు వర్గాల నేతల మధ్య జరుగుతున్న చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ డీల్ మేరకు ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె పళనిస్వామి కొనసాగనున్నారు. పార్టీ అధినేత ఓ పన్నీర్ సెల్వం కొనసాగుతారు. దినకరన్ అరెస్ట్ కావడంతోనే వీరిమధ్య ఈ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు అన్నాడీఎంకే చీలికవర్గాల విలీన చర్చలకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ‘అమ్మ’ వర్గంలోని ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు విలీనం తర్వాత ఏర్పాటయ్యే కొత్త మంత్రివర్గంపై దృష్టి సారించారు. ఆ మంత్రివర్గంలో తమ వర్గం శాసనసభ్యులకు తగిన ప్రాధాన్యత లభించడంతో పాటు కీలక శాఖలు కూడా పొందడానికి పావులు కదుపుతున్నారు. 
 
అన్నాడీఎంకేలో ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు 33 మంది ఉండగా వారిలో మాణిక్కం (చోళవందాన్‌), మనోహరన్‌ (వాసుదేవనల్లూర్‌), మనోరంజితం (వూత్తంగరై)లు మినహా 30 మంది అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలో ఉన్నారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో సామాజికవర్గం ప్రాధాన్యత వ్యవహారం తెరపైకి వచ్చింది. అధికారంలోనూ, పార్టీలోనూ తగిన ప్రాధాన్యత కోరాలని ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు భావించినప్పటికీ శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో సాధ్యపడలేదు. 
 
ప్రస్తుతం అన్నాడీఎంకే (అమ్మ)లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, చీలికవర్గాల విలీనానికి జరుగుతున్న కసరత్తుపై వీరంతా దృష్టి సారించారు. చీలికవర్గాలు విలీనమైతే కొత్త మంత్రివర్గం ఏర్పడటం తథ్యమనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సందర్భాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందులో 28 మంది శాసనసభ్యులు పాల్గొన్నారని, మంత్రివర్గంలో మార్పులు జరిగితే ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యుల సంఖ్యబలానికి తగినట్లు చోటు కల్పించాలని ఒత్తిడి చేయాలని, కొన్ని కీలకమైన శాఖలనూ అప్పగించాలనే డిమాండ్‌ను తీసుకురావాలని నిర్ణయించినట్లు భోగట్టా.