శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 27 అక్టోబరు 2020 (14:31 IST)

వాయు కాలుష్యం గుప్పెట్లో ఢిల్లీ వాసులు

ప్రతి ఏడాది శీతాకాలంలో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పంటవ్యర్థాలను రైతులు తగులబెట్టడం ఢిల్లీ వాసుల ప్రాణం మీదకువస్తోంది. దీనికితోడు, ఇటీవలే రూపొందిన “రైతు చట్టాల”ను వ్యతిరేకిస్తూ, పంట వ్యర్థాలను తగలబెడుతున్న  రైతుల నిరసన జ్వాలలు కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఈ ఏడాది, ఓవైపు “కరోనా” కారణంగా బయటకు రావడానికే భయపడుతున్న ఢిల్లీ వాసులను, మరోవైపు ఈ వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 
ఈ ఏడాది వాయుకాలుష్యం మరింత ఆందోళన కలిగించే అంశమని నిపుణులు చెప్తున్నారు. గత రెండు రోజులుగా “కరోనా” పాజిటివ్ కేసులు ఢిల్లీలో రోజుకు 4 వేలకు పైగా నమోదౌతున్నాయు. 
ఈ శీతాకాలంలో, ఢిల్లీలో రోజుకు 15 వేలకు పైగా “కరోనా” పాజిటివ్ కేసులు నమోదౌతాయని “జాతీయ వ్యాధి నివారణ కేంద్రం” నివేదిక సూచించింది. ఇక, ఢిల్లీ వాయుకాలుష్యం “వన్ మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్” పెరిగితే, “కోవిడ్-19” మరణాల రేటు 8 శాతం పెరుగుతుందని “హార్వార్డ్ యూనివర్శిటీ” పరిశోధనలో కూడా వెల్లడైంది.
 
ఈ నేపధ్యంలో ఢిల్లీ నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. చిన్నారుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపించే ఈ విషమ పరిస్థితిని ప్రభుత్వం వెంటనే చక్కదిద్దాలని దేశ రాజధాని పౌరులు వేడుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితిని యుధ్ద ప్రాతిపదికన చక్కదిద్దేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ సమస్యను సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
 
 
పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్. బి. లోకూర్ నేతృత్వంలో ఏక సభ్య కమిటీని నియామకం చేసింది. ఎట్టకేలకు,  ప్రతి ఏడాది ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలను చుట్టుముట్టే వాయు కాలుష్యాన్ని  నిర్మూలించేందుకు మూడు నాలుగు రోజుల్లో కొత్త చట్టాన్ని
రూపొందించడం ద్వారా “శాశ్వత వ్యవస్థ” ఏర్పాటు చేస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో, సుప్రీం కోర్టు ఏకసభ్య కమిటీ నియామకాన్ని ఉపసంహరించుకుంది.
 
ప్రతిపాదిత “శాశ్వత వ్యవస్థ”, పంటవ్యర్ధాలను తగులబెట్టడం ద్వారా వచ్చే కాలుష్యంతో పాటు, “దేశ రాజధాని ప్రాంతం” లో వచ్చే ఇతరత్రా కాలుష్యాన్ని కూడా పూర్తి గా నిర్మూలించేందుకు కృషి చేస్తుందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్తున్నాయు.  భూరేలాల్ నేతృత్వంలో పనిచేస్తున్న “ఎప్కా” ( పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ సంస్థ) స్థానంలో ఈ ప్రతిపాదిత “శాశ్వత వ్యవస్థ” రానుందని ఈ వర్గాల ద్వారా తెలుస్తోంది.