మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (14:31 IST)

ముకేష్ అంబానీకి బెదిరింపులు.. బాంబులున్న కారు ఢీకొడుతుందంటూ...

ఇటీవలకాలంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఆయన పిల్లలకు కూడా ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. ఇటీవల ఇల్లు యాంటీలియా ముందు కారులో బాంబులు పెట్టింది తామేనని జైషుల్ హింద్ అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. టెలీగ్రామ్ యాప్ ద్వారా సందేశం పంపింది. ఇది కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించింది. బిట్ కాయిన్లలో డబ్బులు పంపించాలని డిమాండ్ చేసింది.
 
లేదంటే నీతా వదినా.. ముకేశ్ అన్నా.. ఈసారి బాంబులున్న కారు మీ పిల్లల కారుపైకి దూసుకెళ్తుందని బెదిరింపులకు దిగింది. నిఘా సంస్థలకూ వార్నింగ్ ఇచ్చింది. 'దమ్ముంటే మమ్మల్ని ఆపండి చూద్దాం. ఢిల్లీ నడిబొడ్డులో మిమ్మల్ని కొట్టినా ఆపినోడే లేడు. మీరు చాలా దారుణంగా విఫలమయ్యారు. మళ్లీ మళ్లీ విఫలమవుతారు' అన హెచ్చరించింది. 
 
పైగా, 'మేం ఎవరని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. మేం మీ పీడకలలం. మీ చుట్టుపక్కనే ఉన్నాం. మీ ఆఫీసులో పనిచేస్తున్నాం. ఓ మామూలు మనిషిలా మీ పక్కనే ఉన్నాం. మీ పక్క నుంచే వెళ్లే బిచ్చగాడిలా ఉన్నాం. ప్రతి చోటా మేమున్నాం. బీజేపీ, ఆరెస్సెస్‌కు అమ్ముడు పోయిన మీ లాంటి వ్యాపార వ్యభిచారులతోనే మాకు పెద్ద సమస్య' అని సందేశంలో పేర్కొంది. దేవుడి దయతో అంబానీ ఇంటి ముందు కారు పెట్టిన సోదరుడు ఇల్లు చేరాడని పేర్కొంది.