1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

అలెక్సాను కుక్కలా మొరగాలని ఆదేశించిన బాలిక... బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా!!

anand mahindra
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ 13 యేళ్ల బాలికకు మహీంద్రా గ్రూపు అధిపతి ఆనంద్ మహీంద్రా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అలెక్సా సాయంతో తన ఇంట్లోకి ప్రవేశించిన కోతులను అలెక్సా సాయంతో తరిమికొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇపుడు ఆ బాలికకు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ కథనం వెనుక ఉన్న వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీకి చెందిన 13 యేళ్ల బాలిక నిఖిత. ఆమె తన మేనకోడలు వామిక (15 నెలలు)ను ఆడిస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు వాళ్లింట్లోకి చొరబడ్డాయి. ఆ కోతులు ఇంట్లో ఉన్న వస్తువులను చెల్లాచెదురు చేస్తూ విధ్వంసం సృష్టించాయి. ఆ సమయంలో పెద్దవాళ్లు ఎవరూ ఇంట్లో లేరు. ఆ వానరాలు తమ వద్దకు వస్తుండగా గమనించిన నిఖిత ఏమాత్రం బయపడకుండా ఎంతో తెలివిగా ఆలోచించింది. ఇంట్లో అలెక్స్ (వాయిస్ అసిస్టెంట్) ఉన్న విషయాన్ని గమనించి, కుక్కలా మొరగాలని అంటూ అలెక్సాను ఆదేశించింది. వెంటనే అలెక్సా స్పీకర్ నుంచి కుక్క అరిచినట్టుగా పెద్ద శబ్దాలు రావడంతో, నిజంగానే కుక్క అరుస్తుందని భావించిన కోతుల గుంపు భయపడి ఇంట్లో నుంచి పారిపోయాయు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఆనంద్ మహీంద్రా కంట పడింది. 
 
పాజిటివిటీకి మారుపేరుగా నిలిచే ఆనంద్ మహీంద్రా.. నిఖిత వంటి వారిని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ క్రమంలో నిఖితకు భవిష్యత్తులో తాము ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆ అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత ఏదైనా కార్పొరేట్ సంస్థలో చేరాలనుకుంటే తమ మహీంద్రా రైజ్ సంస్థ ఆమె కోసం ద్వారాలు తెరిచే ఉంటుందని తెలిపారు. ఎపుడైనా ఉద్యోగం కావాలనుకుంటే మహీంద్రా రైజ్‌లో చేరాలని ఆహ్వానిస్తున్నాం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పైగా, ఇప్పటితరం పిల్లల మేధాశక్తి మన ఊహకు అందని విషయం. వారి తెలివితేటలు ఆమోఘం. ఆ సమంయలో నిఖితకు వచ్చిన ఆలోచన అద్భుతం అంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.