బెంగుళూర్లో మరో అత్యాచారం... యువతికి మత్తిచ్చిన జ్యోతిష్కుడు!
బెంగుళూర్లో ఇటీవల మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ స్థితిలో మరో యువతిపై అత్యాచారం జరిగింది. శుభమా అని పెళ్లి గురించి విషయాలను తెలుసుకోడానికి వెళ్లిన యువతిపై జ్యోతిష్కుడు అగాయిత్యానికి పాల్పడ్డాడు.
తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందోనని జ్యోతిష్యం చెప్పించుకోడానికి వెళ్లిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీరుపై అత్యాచారం చేసిన జ్యోతిష్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన దామోదరన్ అలియాస్ దాము రెండు సంవత్సరాల క్రితం రామమూర్తినగరలోని హొస్సళ నగర్ లో జ్యోతిష్య కేంద్రాన్ని ప్రారంభించాడు.
పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇక్కడి ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె దామోదరన్ దగ్గర ఈనెల 19వ తేదీన అపాయింట్మెంట్ తీసుకున్నారు.
తనకు వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోడానికి ఆమె బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో దామోదరన్ ఆ యువతికి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చాడు. దాన్ని తాగితే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. దీంతో ఆ పానీయం సేవించిన ఆ యువతి మత్తులోకి జారుకుంది.
అనంతరం దామోదరన్ ఆమెపై అత్యాచారం చేశాడు. సాయంత్రం తరువాత ఆమెకు స్ఫృహ వచ్చింది. వెంటనే ఆమె స్నేహితుడికి ఫొన్ చేసి విషయం చెప్పింది. అతను రామమూర్తినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్య నివేదికలో తేలింది. దీంతో దామోదరన్ను అరెస్ట్ చేశారని పోలీసులు శనివారం తెలిపారు. కాగా ఈ విధంగా ఎంత మంది మహిళలను మోసం చేశాడు అని ఆరా తీస్తున్నామని చెప్పారు.