శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 జులై 2017 (10:57 IST)

బీజేపీ భీష్ముడు ఎల్కే.అద్వానీకి భారతరత్న పౌరపురస్కారం?

పార్టీ కోసం తన జీవితాన్ని ధారపోసి.. చివరకు ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టలేక ఇంటికే పరిమితమైన భారతీయ జనతా పార్టీ భీష్మకురువృద్ధుడు ఎల్కే.అద్వానీని ప్రసన్నం చేసుకున్న కమలనాథులు రంగంలోకి దిగినట్టు తెలుస

పార్టీ కోసం తన జీవితాన్ని ధారపోసి.. చివరకు ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టలేక ఇంటికే పరిమితమైన భారతీయ జనతా పార్టీ భీష్మకురువృద్ధుడు ఎల్కే.అద్వానీని ప్రసన్నం చేసుకున్న కమలనాథులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆ దిశగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా, దేశంలోనే అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను ఆయనకు ప్రదానం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు కూడా ధృవీకరించడం గమనార్హం. అయితే ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని అద్వానీ సన్నిహితులొకరు చెప్పడం కొసమెరుపు. 
 
కాగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎల్కే.అద్వానీ పేరు ఒక్కటే వినపిస్తూ ఉండేది. కానీ, 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అద్వానీ మిన్నకుండిపోయారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో తదుపరి రాష్ట్రపతి ఎల్కే.అద్వానీ అని ప్రతి ఒక్కరూ ఘంటాపథంగా చెపుతూ వచ్చారు.
 
కానీ, మోడీ చివరి నిమిషంలో తన రాజకీయ గురువు అద్వానీకి తేరుకోలేని షాకిచ్చారు. బీహార్ గవర్నర్‌గా ఉన్న రాంనాథ్ కోవింద్ పేరును తెరపైకి తెచ్చారు. దీంతో అద్వానీని మోడీ ఉద్దేశ్యపూర్వకంగా అవమానిస్తున్నారనే విమర్శలు చెలరేగాయి. ఇపుడు వీటన్నింటికి సమాధానం చెప్పడంతో పాటు.. అద్వానీని ప్రసన్నం చేసుకునేందుకు వీలుగా ఆయనను భారతరత్న పురస్కారం ఇవ్వాలని భావిస్తున్నట్టు వినికిడి.