1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 జులై 2015 (11:58 IST)

బీహార్ రాష్ట్రానికి నితీష్ కుమార్ ఆపద్బాంధవుడు : బీజేపీనేత శత్రుఘ్నసిన్హా

బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి బీహారీలను ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన మరుసటి రోజే బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్నసిన్హా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు. బీహార్ రాష్ట్రానికి నితీష్ కుమార్ ఒక్కరే ఆపద్బాంధవుడంటూ కొనియాడారు.
 
ఆదివారం పాట్నాకు వచ్చిన శత్రుఘ్నసిన్హా.. నితీష్ కుమార్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మాట్లాడుతూ.. దేశంలోనే నితీశ్‌ కన్నా బెస్ట్ సీఎం ఎవ్వరూ లేరని కితాబిచ్చారు. బీహారీలకు రక్షణ కవచంగా నితీష్ కుమార్ ఒక్కరే ఉండగలరన్నారు. 
 
వాస్తవానికి నితీశ్‌ సర్కారును కూకటివేళ్లతో పెకిళించి వేయాలని బీహారీలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిస్తుంటే సిన్హా మాత్రం నితీశ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. నేడో రేపో ఆర్జేడీ అధినేత లాలూను కూడా కలుసుకోనున్న సిన్హా సొంతపార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
తనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కొంతకాలంగా ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీ అధిష్టానాన్ని బెదిరించేందుకే శతృఘ్నసిన్హా ఆర్జేడీ - జేడీయూ నేతలతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని బీహార్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళకు శతృఘ్నసిన్హా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కమలనాథులకు ఏమాత్రం రుచించడం లేదు.