1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (07:36 IST)

మంచినీరు అనుకుని పొరపాటున శానిటైజర్ తాగిన బీఎంసీ కమిషనరు!

ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓ ఆశ్చర్యకర సంఘటన జరిగింది. మున్సిపల్ అసిట్టెంట్ కమిషనరు పొరపాటున మంచినీరు అనుకుని శానిటైజర్ తాగారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బిఎంసి) బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సమావేశానికి విద్యాశాఖ జాయింట్‌ కమిషనర్‌ అనారోగ్యంతో సమావేశానికి రాలేదు. దీంతో అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ పవార్‌ కూడా పాల్గొని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 
 
అయితే తన ప్రసంగానికి ముందు వాటర్‌ బాటిల్‌కు బదులుగా శానిటైజర్‌ బాటిల్‌ను తీసుకుని తాగేశారు. వాటర్‌ బాటిల్‌, శానిటైజర్‌ బాటిల్‌ ఒకే రకంగా, పక్కపక్కనే ఉండటంతో ఈ పొరపాటు జరిగింది. అయితే వెంటనే విషయాన్ని గమనించిన రమేశ్‌.. శానిటైజర్‌ను ఉమ్మేశారు. అనంతరం సిబ్బంది ఆయనకు మంచినీరు అందించారు. 
 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అనంతరం టేబుల్‌పై నుంచి శానిటైజర్‌ బాటిల్స్‌ను తీసేసినట్లు బిఎంసి అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో యావత్మల్‌ జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించిన సంగతి తెలిసిందే. 
 
పోలియో చుక్కలకు బదులు శానిటైజర్‌ వేయడంతో.. 12 మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.