గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 జులై 2019 (11:17 IST)

జాబిల్లిపై చంద్రయాన్-2 అన్వేషణ ఏమిటి? 15 నిమిషాల టెర్రర్ ఎందుకు?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ రాకెట్‌ను జీఎస్ఎల్వీ చంద్రమండలంపైకి మోసుకెళ్లనుంది. సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు నింగిలోకి ఎగిరే చంద్రయాన్-2 48 రోజుల పాటు సుధీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రమండలంపై ల్యాండ్ కానుంది. అయితే, దాదాపు రూ.978 కోట్లు వెచ్చించి చేపడుతున్న ఈ ప్రయోగంలో చంద్రుడిపై ల్యాండర్‌ దిగే చివరి 15 నిమిషాలు చాలా కీలకంగా భావిస్తున్నారు. ఇందుకోసం దక్షిణ ధ్రువంపై తేలికగా దిగేవిధంగా ఆధునిక సాంకేతికతను చంద్రయాన్‌-2లో వినియోగించారు. అయినప్పటికీ ఆ 15 నిమిషాలు తమకు టెర్రరే అని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
మరోవైపు, ఈ చంద్రయాన్-2 ప్రయోగం జాబిల్లిపై పలు రకాల పరిశోధనలు చేయనుంది. చంద్రుని కక్ష్యలో సంచరించే ఆర్బిటర్‌ బరువు 2,379 కిలోలు. ఏడాదిపాటు అక్కడే తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. చంద్రుడు ఉపరితలంపై దిగే విక్రమ ల్యాండర్‌ బరువు 1471 కిలోలు. దేశ అంతరిక్ష పరిశోధన పితామహుడు విక్రమ్‌ సారాబాయి పేరును ఈ ల్యాండర్‌కు పెట్టారు. 
 
చంద్రునిపై సిసలైన పరిశోధనలు చేసే కీలక వ్యవస్థ ప్రగ్యాన్‌ రోవర్‌. దీని బరువు 27 కిలోలు. జాబిల్లిపై నీరు, ఖనిజాలపై రెండు వారాల పాటు అన్వేషిస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చెందిన లేజర్‌ రీట్రోరెఫ్లెక్టర్‌ ఆర్రే (ఎల్‌ఆర్‌ఏ) అనే పరికరాన్ని కూడా చంద్రయాన్‌-2 తనతోపాటు తీసుకెళ్తోంది. ఈ పరికరం చంద్ర గర్భంలోని ఖనిజాలను, నీటి జాడలను పరిశీలించనుంది. ఇలా చంద్రయాన్-2 అనేక రకాలైన పరిశోధనలను చేపట్టనుంది.