నింగిలోకి చంద్రయాన్ -2.. జాబిల్లిని చేరేందుకు 48 రోజులు  
                                       
                  
				  				  
				   
                  				  శ్రీహరి కోట స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2ను మోసుకెళ్తున్న జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 20 గంటల కౌంట్డౌన్ పూర్తిచేసుకొని మధ్యాహ్నం సరిగ్గా 2.43గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లింది. 
	
				  
	 
	సాంకేతిక కారణాలతో జులై 15న నిలిచిన ప్రయోగం ఎట్టకేలకు అన్ని సవాళ్లను అధిగమించింది. ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన రాకెట్ 16.13 నిమిషాలు ప్రయాణించి చంద్రయాన్-2ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది.
				  											
																													
									  
	 
	చందమామను చంద్రయాన్-2 చేరుకునేందుకు 48 రోజులు పట్టనుంది. భూ కేంద్రం నుంచి చంద్రయాన్-2 మాడ్యూల్లోని ద్రవ ఇంధనాన్ని అనేక పర్యాయాలు మండిస్తూ కక్ష్యలను మార్పుచేస్తూ చంద్రుడి వైపు పయనింప చేస్తారు. 23వ రోజున చంద్ర బదిలీ కక్ష్యలోకి చొప్పించనున్నారు.
				  
				  
	 
	48వ రోజున అంటే సెప్టెంబరు ఏడో తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగేందుకు ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుంది. అలా జాబిల్లిపై దిగిన వెంటనే విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది. దిగిన ప్రదేశానికి 500 మీటర్ల పరిధిలో 14 రోజులపాటు సంచరిస్తూ ప్రగ్యాన్ రోవర్ చంద్రునిపై పరిశోధనలు చేయనుంది.