1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 మే 2021 (20:03 IST)

సుప్రీం ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధం : చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరిగే కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు తాను సిద్ధంగా ఉన్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. గురువారం జరిగిన జర్నలిస్టుల యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యక్ష ప్రసారాలపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తానన్నారు. రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలు అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశామన్నారు. ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయన్నారు. 
 
ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం జర్నలిస్టులు పడుతున్న బాధలు తమకు తెలుసన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఇక నుంచి జర్నలిస్టులు కోర్టు కార్యకలాపాల కోసం ఎటువంటి సమస్యను ఎదుర్కోకూడదన్నారు. 
 
ఆ దృష్టితోనే ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. అక్రిడేషన్ల మంజూరులో ఎవరికి అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవరించేలా, చర్యలు తీసుకుంటామన్నారు. 
 
జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్‌లతో కూడిన కమిటీ ఈ యాప్ రూపకల్పన చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే యాప్‌ను సుప్రీంకోర్టు సాంకేతిక బృందం రూపొందించిందని చెప్పారు. సుప్రీంకోర్టు రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే పొందవచ్చని అన్నారు. 
 
కోర్టులో జరిగే కార్యకలాపాలు.. పారదర్శకంగా ఉండేదుకుగాను సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.