శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (11:16 IST)

సుప్రీంకోర్టు సర్వోన్నతమైనది కాదు : అసదుద్దీన్

సుప్రీంకోర్టు సర్వోన్నతమైనది కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. సుప్రీం తీర్పుతో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందని, తనకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అప్పట్లో బాబ్రీ మసీదును కూల్చి ఉండకపోతే ఇప్పుడీ తీర్పు వచ్చేది కాదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామంటూనే అదే సర్వోన్నతమైనది కాదని అసద్ వ్యాఖ్యానించారు. అసలు అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఐదెకరాలు కేటాయించాలన్న కోర్టు ఆదేశాలపైనా అసద్ స్పందించారు. 
 
తమపై సానుభూతి అవసరం లేదని, దానం అక్కర్లేదని తేల్చి చెప్పారు. తమ పోరాటం మసీదు కోసమే కానీ, భూమి కోసం కాదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంపై నమ్మకం ఉందంటూనే అయోధ్య విషయంలో చివరి వరకు పోరాడతామని అన్నారు.
 
అసద్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయవాది పవన్‌కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. జహంగీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో ఒవైసీపై ఫిర్యాదు చేశారు. పవన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.