శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (20:11 IST)

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామమందిరం తథ్యం : హరీష్ రావత్

వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రామమందిర నిర్మాణానికి చిత్తశుద్ధితో పని చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హరీష్ రావత్ స్పష్టంచేశారు. ఇదే అంశంపై ఆయన డెహ్రాడూన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు సందర్భాల్లో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం తీవ్రంగా కృషి చేసిందన్నారు. అలాగే, వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం రామమందిర నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. 
 
అంతేకాకుండా, రామమందిర నిర్మాణంపై తాను చేసిన ప్రకటన లేదా వ్యాఖ్యలను మీడియా విస్తృత ప్రచారం కల్పించిందనీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కడా కూడా ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చడం లేదా ఖండించలేదని గుర్తుచేశారు. అదేసమయంలో మందిరం విషయంలో బీజేపీ పెద్దగా శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. కానీ, రామమందిర అంశాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మాత్రమే వాడుకుంటుందన్నారు. కానీ, తమ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా మందిర నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. 
 
అంతేకాకుండా, పుల్వామా ఉగ్రదాడిపై ఆయన స్పందిస్తూ, కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే ఈ దేశంలో జాతీయ నేత అనే కోణంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ దేశంలోని ప్రతి పౌరుడూ జాతీయవాదులమేననే విషయాన్ని బీజేపీ గుర్తుపెట్టుకోవాలన్నారు.