1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మే 2020 (14:33 IST)

చెన్నైలో కోయంబేడు - హైదరాబాద్‌లో మలక్‌పేట్ .. మార్కెట్లలో కరోనా విజృంభణ

కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. అలాగే, ఆ ప్రాంతం, ఈ ప్రదేశం అనే తేడా లేకుండా వ్యాపిస్తోంది. తాజాగా చెన్నై మహానగరంలో అతిపెద్ద కూరగాయల మార్కెట్‌గా ఉన్న కోయంబేడు పండ్లు, పూలు, కూరగాయల మార్కెట్‌లో ఈ కరోనా వైరస్ వ్యాపించింది. ఇక్కడ పని చేసే ఓ కూలీ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెంది, ఏకంగా 119 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో చెన్నైకు చెందినవారు 52 మంది ఉండగా, అరియలూరు 22, కడలూరు 17, కాంచీపురం 7, విళుపురం 20, పెరంబలూరు జిల్లాలకు చెందిన ఒకరు ఒకరు చొప్పున ఉన్నారు. ఈ కారణంగా ఈ మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 
 
నిజానికి ఈ మార్కెట్ నుంచి బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భారీ మొత్తంలో కూరగాయలు లారీల లోడులు వస్తుంటాయి. అలాగే, ఈ మార్కెట్ నుంచి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు కూరగాయలు రవాణా చేశారు. అయితే, ఈ మార్కెట్‌లో పని చేసే కూలీలకు వైరస్ సోకిందని తేలడంతో మార్కెట్‌ను మూసివేశారు. 
 
ఈ కారణంగా మూడు రోజులుగా చెన్నై నుంచి నెల్లూరు జిల్లాకు కూరగాయల రవాణా నిలిచిపోయింది. సాధారణంగా ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లాకు రోజుకు 100 టన్నుల కూరగాయలు రవాణా అవుతాయి. వైరస్ ఉనికి కారణంగా చెన్నై నుంచి వచ్చేవారిపై నిఘా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
 
మరోవైపు, హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట మార్కెట్‌లో కూడా ఈ వైరస్ సోకింది. దీంతో మార్కెట్‌లోని వ్యాపారులు, కూలీలతో పాటు ఈ ప్రాంతంలోని స్థానికులను అప్రమత్తం చేసి, కంటైన్మెంట్ జోనుగా ప్రకటించారు. అలాగే, రంగంలోకి దిగిన హెల్త్ వర్కర్లు వైరస్ వ్యాప్తికి గల కారణాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మార్కెట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.