1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (18:14 IST)

నెమ్మదిగా విస్తరిస్తున్న మరో డేంజరస్ గేమ్....

ప్రస్తుతం గేమింగ్ ప్రపంచాన్నే శాసిస్తున్న గేమ్ PUBG. ఇది ఒక ఆన్‌లైన్ గేమ్. ప్లేయర్ అనౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్ సంక్షిప్త నామమే PUBG. ఇప్పుడు ఏ నలుగురు పిల్లలు కలిసి ఎదురెదురుగా కూర్చుని ఉన్నా ఈ గేమ్‌నే ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ గేమ్ గురించిన లక్షల జోకులు, ట్రోలింగ్స్ కనిపిస్తున్నాయి.
 
ఇందులో పారాచ్యూట్ ల్యాండింగ్, వెపన్స్ కలెక్షన్, శత్రువుల వ్యూహాల నుండి తప్పించుకోవడం, ఎదురుదాడి చేయడం మరియు వ్యూహ ప్రతివ్యూహాలతో కూడిన అనేక ఆసక్తికరమైన ఫీచర్లు ఉంటాయి.
 
ఇప్పటివరకు ఈ గేమ్‌ను 20 కోట్ల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంతభారీ స్థాయిలో డౌన్‌లోడ్ చేసుకున్న గేమ్‌గా ఇది రికార్డులకెక్కింది. దీని ప్రతిరోజూ కనీసం 3 కోట్ల మంది ఆడుతున్నారట. ఇందులో ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తెస్తుండటంతో ఆడే వారిలో రోజురోజుకూ ఆదరణ పెరిగి, ఇది ఒక వ్యసనంలాగా మారుతోంది.
 
చాలా మంది పిల్లలు నిద్రాహారాలు మాని మరీ ఈ గేమ్‌ను ఆడుతూ దీనికి బానిసలైపోయారు. ఈ గేమ్ వ్యసనానికి బానిసలైన చాలా మంది పిల్లలను తల్లిదండ్రులు సైక్రియార్టిస్ట్‌లకు చూపిస్తున్నారట.
 
ఈమధ్య ఒక సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీతో ఒక తల్లి మాట్లాడుతూ తన కొడుకు గేమ్‌లకు అలవాటు పడి చదువులను పక్కనపెట్టేస్తున్నాడని వాపోయిందట, వెంటనే ప్రతిస్పందనగా ప్రధాని మీ అబ్బాయి PUBG ఆటగాడా అని సరదాగా అన్నారట. ప్రధాని సరదాగా అన్నప్పటికీ కూడా ఆ స్థాయి వ్యక్తికి కూడా ఆ గేమ్ గురించి తెలిసిందంటే అది ఏ స్థాయిలో విస్తరించిందో తెలుసుకోవచ్చు.
 
తాజాగా ముంబైలో కుర్లా ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు PUBG గేమ్ ఆడేందుకు ఖరీదైన ఫోన్ కొనివ్వమని కోరాడు. దానికి ఆ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆ అబ్బాయి కిచెన్‌లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. ఈ సంఘటన చాలు ఆ గేమ్ మనుషులను ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవడానికి.
 
ఇప్పటికే కొన్ని చోట్ల ప్రభుత్వాలు ఇలాంటి గేమ్‌ల బారిన పడిన వారికి ప్రత్యేక కౌన్సెలింగ్‌లు ఇప్పిస్తూ, ఇలాంటి గేమ్‌లు ఆడటం వల్ల మనిషిపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలియజేస్తూ ప్రకటనలు కూడా ఇస్తున్నాయి.