మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:37 IST)

పెళ్లి పత్రికల్లో వధూవరుల పుట్టినతేదీలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట..

భారతదేశం శాస్త్రీయ మరియు సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ, కొన్ని విషయాల్లో వెనుకబాటుతనం అలాగే కొనసాగుతోంది. అందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే బాల్య వివాహాలు. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాటికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అయితే బాల్యవివాహాలను అడ్డుకోవడం కోసం రాజస్థాన్ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
 
ఇప్పటి నుంచి వివాహ ఆహ్వాన పత్రికలలో ఖచ్చితంగా వధూవరుల పుట్టినతేదీలను జతపరచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బాల్యవివాహాలపై ఎన్ని చర్యలు చేపట్టినా అవి యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. పెద్దల సాంఘిక దూరాచారానికి ముక్కుపచ్చలారని ఆడపిల్లలు బలైపోతున్నారు. దీనికి అడ్డుకట్టవేయడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా బుండీ జిల్లాలో మొదలుపెట్టారు.
 
పెళ్లి పత్రికల్లో వధూవరుల పుట్టినతేదీలను తప్పనిసరిగా ముద్రించాలని జిల్లా అధికారులు ప్రజలకు చెబుతున్నారు. బుండీ జిల్లాలోనే బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని వారు తెలిపారు. వాటికి అడ్డుకట్ట వేయడానికి అధికారులు ఆ జిల్లాపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పెళ్లి పత్రికల్లో పుట్టినతేదీలతో పాటు బాల్యవివాహాలు నేరం అని కూడా ముద్రించాలని కోరుతున్నారు. 
 
అక్షయ తృతీయ రోజున మే 7వ తేదీ ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల్లో బాల్య వివాహాలు జరుగుతాయి. వాటిని నియంత్రించడం కోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రింటింగ్ ప్రెస్ వాళ్లకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. శుభకార్యాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలోని కమిటీలు బాల్య వివాహాలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి.