1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (18:20 IST)

కర్నాటక బై పోల్ : కాంగ్రెస్‌లో ప్రకంపనలు... రాజీనామాల పర్వం

కర్నాటక రాష్ట్రంలో ఖాళీ అయిన 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించారు. మొత్తం 15 స్థానాలకుగాను 12 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 
 
ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపింది. ఫలితంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత (సీఎల్సీ) పదవికి రాజీనామా చేశారు.
 
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజా తీర్పును కాంగ్రెస్ పక్ష నేతగా తాను గౌరవించాలని చెప్పారు. సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని... రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించానని తెలిపారు. 
 
అలాగే, రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు దినేష్ గుండూరావు ప్రకటించారు. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
 
తాజాగా గుండూరావు కూడా ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పంపించినట్లు వెల్లడించారు.