రైల్వే మాజీ మంత్రి హత్య కేసు : నలుగురికి యావజ్జీవం!
రైల్వే మాజీ మంత్రి హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తుదితీర్పును వెలువరించింది. సుమారు 40 యేళ్ళ క్రితం రైల్వేశాఖ మాజీ మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. బీహార్లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో మిశ్రాను పట్టపగలే బాంబులతో దాడి చేసి చంపేశారు.
ఈ కేసును విచారించిన ఢిల్లీలోని జిల్లా జడ్జి వినోద్ గోయిల్ గురువారం నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వీరిలో రంజన్ ద్వివేదీ, సంతోష్ ఆనంద్, సుదేవ్ ఆనంద్, గోపాల్జీలు ఉన్నారు. వీరికి ఐపీసీలోని 302, 326, 324,120-బీ సెక్షన్ల ప్రకారం న్యాయమూర్తి దోషులుగా నిర్ధారించి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తున్నట్టు తన తీర్పులో పేర్కొన్నారు.
కారాగార శిక్షతోపాటు సంతోష్ ఆనంద్, సుదేవ్ ఆనంద్లకు రూ.25 వేల చొప్పున జరిమానా, ద్వివేదీ, గోపాల్జీలకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ బాంబు దాడిలో మరణించిన లలిత్ నారాయణ్ మిశ్రా, మరో మరో ఇద్దరు వ్యక్తుల చట్టబద్ధ వారసులకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా న్యాయమూర్తి బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.