దేవయానిపై చర్యలకు కేంద్రం సిద్ధం
దౌత్యాధికారిగా పని చేసిన దేవయాని ఖోబ్రగడే ఏదో రకంగా వివాదస్పదం అవుతూనే ఉన్నారు. పని మనిషి కేసులో అమెరికాలో గత ఏడాది అరెస్టయి వార్తల్లోకెక్కారు. భారత ప్రభుత్వ అనుమతి లేకుండానే తన పిల్లలకు అమెరికా పాస్ పోర్టు తీసుకోవడం, అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడడంతో ఆమె మరోమారు వివాదాల్లో చిక్కుకున్నారు.
భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై కేంద్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. వీసా నియమాలను ఉల్లంఘించిన కేసులో అమెరికా అధికారులు ఆమెను అరెస్టు చేయడం తెలిసిందే. ఆమెపై శాఖపరమైన విచారణ చేపట్టగా, భారత విదేశాంగ శాఖకు చెప్పకుండానే దేవయాని తన పిల్లలకు అమెరికా పాస్పోర్టులు తీసుకున్నట్టు తేలింది.
దౌత్యాధికారుల ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధమని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాక అధికారిక అనుమతి లేకుండా ఆమె మీడియాతో మాట్లాడారు. దీంతో ఆమెపై శాఖాపరమైన, క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే ఏవిధమైన చర్యలు తీసుకుంటుందో తెలియరాలేదు. అమెరికా నుంచి తిరిగిరాగానే దేవయాని విదేశాంగ శాఖ అభివృద్ధి భాగస్వామ్య విభాగంలో డెరైక్టర్ స్థాయిలో నియమితులయ్యారు.
ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నారు. కాగా, తాను ఏ తప్పూ చేయలేదని దేవయాని ఇప్పటికీ బలంగా వాదిస్తున్నారు. దౌత్యాధికారుల పిల్లలకు డిప్లొమాటిక్ పాస్పోర్టులు ఇస్తారని, మైనర్ పిల్లలు రెండు పాస్పోర్టులు తీసుకోవచ్చని సర్వీసు నియమాలు చెబుతున్నాయని ఆమె తెలిపారు.