శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:09 IST)

పోలీసులే ఎంతపని చేశారు.. కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం..

రక్షణ కల్పించాల్సిన పోలీసులే కాటేశారు. యూపీలో ఖాకీల సాయంతో కొందరు ఏకంగా స్టేషన్‌ నుంచే బాలికను అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎటావా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఎటావా ప్రాంతానికి చెందిన యువతిని ఆగస్టు 14న అదే ప్రాంతానికి చెందిన యువకుడు కొందరి సాయంతో కిడ్నాప్‌ చేశాడు. ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె తిరస్కరించింది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఎటావా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.
 
గురుగ్రామ్‌ గ్రామంలో బాలికను గుర్తించి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆగస్టు 21న ఆమెను అంతకుముందు కిడ్నాప్ చేసిన వారే మహిళా కానిస్టేబుల్‌ సాయంతో టాయిలెట్‌లో బంధించి తర్వాత అపహరించారు. ఢిల్లీతోపాటు ఎన్‌సీఆర్‌లోని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి 12 మందికిపైగా సామూహిక లైంగిక దాడి చేశారు. విషయం వెలుగులోకి రావడంతో కేసు దర్యాప్తుకు ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారిని నియమించింది. 
 
స్టేషన్ హౌస్ ఆఫీసర్, మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. లూవ్‌కుష్ అనే వ్యక్తి తనను వివాహం చేసుకోవాలని అనుకున్నాడని, తిరస్కరించడంతో అపహరించాడని బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. నేరానికి పాల్పడిన 12 మందిని పోలీసులు అరెస్టు చేసి వారిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాహుల్‌ కుమార్‌ తెలిపారు.