ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (16:22 IST)

గుర్మీత్ సింగ్ పదేళ్ళ జైలు.. కోర్టులో బోరున ఏడ్చిన రాక్‌స్టార్ బాబా

తన ఆశ్రయంలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ సింగ్ బాబాకు రోహ్‌తక్ సీబీఐ ప్రత్యేక కోర్టు పదేళ్ళ జైలుశిక్ష విధించింది. రోహ్‌తక్ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేస

తన ఆశ్రయంలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ సింగ్ బాబాకు రోహ్‌తక్ సీబీఐ ప్రత్యేక కోర్టు పదేళ్ళ జైలుశిక్ష విధించింది. రోహ్‌తక్ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో న్యాయమూర్తి ఈ శిక్షను ఖరారు చేశారు. 
 
15 ఏళ్లనాటి అత్యాచార కేసులో కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించడంతో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కోర్టు రూములోనే కుప్పకూలిపోయారు. తీర్పు విని నిర్ఘాంతపోయిన రాక్‌స్టార్ బాబా కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
ఆ తర్వాత గుర్మీత్ బాబా ఆ కోర్టు హాలు నుంచి బ‌య‌ట‌కు వచ్చేందుకు మొండికేశారు. ఆయ‌న‌ను పోలీసులు బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. ఆయ‌న‌కు ప్ర‌స్తుతం జైలులోనే వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మ‌రోవైపు ఆయ‌న‌కు శిక్ష విధించినందుకు గానూ ఆయ‌న అనుచ‌రులు ఆందోళ‌న‌ల‌కు దిగారు. 
 
వైద్య పరీక్షల అనంతరం బాబాను జైలుకు తరలించనున్నారు. అక్కడ ఆయనకు జైలు యూనిఫాం, ప్రత్యేక గది కేటాయిస్తారు. బాబాకు శిక్ష ఖారారైన అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. కోర్టు తీర్పును ప్రజలు గౌరవించాలని, సంయమనం పాటించాలని కోరారు. 
 
కోర్టు తీర్పు అనంతరం డేరా బాబా అనుచరులు మరోమారు హింసాత్మక చర్యలకు దిగారు. మెగా, సిర్సా ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఈ రెండు ప్రాంతాలతో సహా పలు ఏరియాల్లో కర్ఫ్యూ విధించారు. పుల్కా ఏరియాలో డేరా బాబా అనుచరులు రెండు కార్లు తగులబెట్టారు. అలాగే, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు అదనపు బలగాలను తరలిస్తున్నారు.