శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (12:07 IST)

కాళ్ళకు మెట్టెలు.. ముఖానికి బొట్టు పెట్టుకోలేదు.. విడాకులు కోరిన భర్త!

అగ్ని సాక్షిగా పెళ్లాడిన తన భార్య ముఖానికి బొట్టు, కాళ్లకు మెట్టెలు పెట్టుకోలేదని ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు. పైగా, తనకు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. అతని వాదనలు ఆలకించిన కోర్టు.. విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు గౌహతి కోర్టు కీలక తీర్పును వెలువరించింది. 
 
దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ అజయ్ లాంబా, జస్టిస్ సౌమిత్రా సైకియాలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఫ్యామిలీ కోర్టు, విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించగా, బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు.
 
కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. హిందూ మహిళ, వివాహం తర్వాత ముఖానికి సిందూరం, కాళ్లకు మెట్టలు ధరించడం సంప్రదాయమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇది భారతీయుల మనోభావాలకు సంబంధించిన విషయమని, భర్త మనోభావాలను గౌరవించాలని, ఆ పని చేయలేకుంటే వివాహ బంధానికి అర్థం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
 
'కుంకుమ, మెట్టలు ధరించేందుకు ఇష్టపడటం లేదంటే, తాను అవివాహితనని ప్రపంచానికి తెలియజేయాలని ఆమె భావిస్తోంది. ఆమె పెళ్లిని అంగీకరించినట్టుగా అనిపించడం లేదు. వివాహ బంధాన్ని కొనసాగించడం ఆమెకు ఇష్టం లేనట్టుగా ఉంది' అంటూ హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, విడాకులు మంజూరు చేసింది.