గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 10 నవంబరు 2016 (14:44 IST)

పోలీసులు లాక్కెళ్ళిన స్కూటర్ ఇవ్వలేదని.. శరీరంపై కిరోసిన్ పోసుకుని హిజ్రా ఆత్మహత్య

ట్రాఫిక్ పోలీసులు కొందరు నిజాయితీగా ఉంటే మరికొందరు మామూలు తీసుకోనిదే నిద్రపోరు. అలాంటిది.. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ హిజ్రా నుంచి పోలీసులు బలవంతంగా స్కూటర్‌ను లాక్కెళ్లడంతో ఆందోళనకు గురైన సదరు హిజ్ర

ట్రాఫిక్ పోలీసులు కొందరు నిజాయితీగా ఉంటే మరికొందరు మామూలు తీసుకోనిదే నిద్రపోరు. అలాంటిది.. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ హిజ్రా నుంచి పోలీసులు బలవంతంగా స్కూటర్‌ను లాక్కెళ్లడంతో ఆందోళనకు గురైన సదరు హిజ్రా కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పింటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హిజ్రా ఆత్మహత్యకు పాల్పడటంతో సహచర హిజ్రాలు ఆందోళనలకు దిగారు. ఈ ఘటన చెన్నై టీనగర్, పాండి బజార్‌‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పాండిబజార్ తిరుమలై పిళ్‌లై వీధిలో వాహనాల తనిఖీల్లో పోలీసులు మంగళవారం రాత్రి నిమగ్నమయ్యారు. అర్థరాత్రి పూట అటుగా వచ్చిన ఓ స్కూటర్‌ను పోలీసులు ఆపారు. ఆ స్కూటర్‌ను నడిపింది హిజ్రా అని గుర్తించిన పోలీసులు ఆ వాహనానికి ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్‌లు ఇవ్వమన్నారు. అయితే ఆ హిజ్రా వాటిని చూపేందుకు నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్నట్టుగా నిర్ధారించుకున్న పోలీసులు ఆ స్కూటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని పాండి బజార్‌ స్టేషన్‌కు తరలించారు. 
 
ఇంతవరకు అంతా బాగానే ఉన్నా, బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో పాండి బజార్‌ స్టేష‌కు వచ్చిన ఆ హిజ్రా తన స్కూటర్‌ను అప్పగించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. స్టేషన్ సిబ్బంది నిరాకరించి బయటకు బలవంతంగా పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన హిజ్రా... తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోలీసు స్టేషన్ ఎదుటే తన శరీరంపై మీద పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ ఘటనలో హిజ్రా చికిత్స పొందుతూ మరణించింది. ఈమె చూలైమేడు, నమశ్శివాయ పురంకు చెందిన తార (33)గా పోలీసులు గుర్తించారు. 
 
ఈ ఘటనతో చెన్నై నగరంలో ఉన్న హిజ్రాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆందోళన బాట పట్టారు. తార స్కూటర్‌ను లాక్కెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై విచారణ చేపట్టాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు.