ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (09:22 IST)

బాబ్రీ మసీదును కూల్చింది నేనే.. గర్వంగా ఉంది: సాధ్వీ

తాను శపించడం వల్లే ముంబై ఉగ్రదాడులో ముంబై ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే ప్రాణాలు కోల్పోయాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని బాబ్రీమసీద్ విధ్వంసం జరిగినప్పుడు తాను అక్కడికి వెళ్లానని, మసీదుపైకి ఎక్కి కూల్చానని ప్రకటించారు. పైగా, అయోధ్యలో బ్రహ్మండమైన రామమందిరాన్ని నిర్మిస్తామని చెప్పారు. 
 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, బాబ్రీ మసీదుపైకి ఎక్కి కూల్చాను. దానిని కూల్చే అవకాశం, శక్తి భగవంతుడు నాకు కల్పించాడు. బాబ్రీమసీదును కూల్చే కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు గర్వంగా ఉన్నది. అక్కడ రామమందిరాన్ని ఖచ్చితంగా నిర్మించి తీరుతాం. ఈ విషయంలో నన్ను ఎవరూ ఆపలేరంటూ ఆమె ప్రకటించారు. 
 
హేమంత్ కర్కరేపై చేసిన వ్యాఖ్యలతో ఆమె ఎన్నికల సంఘం కన్నెర్రజేసింది. ఇపుడు ఏకంగా నోటీసునే జారీ చేసింది. తాజా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీ చేసింది. అంతేగాక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచుగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించరాదంటూ అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. రాజకీయ నాయకులు విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంలో మతసామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించింది. 
 
అంతేగాక వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని చేసే ప్రసంగాలు కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి, సంయమనం పాటించి మాట్లాడితే మంచిదని ఈసీ హితవు పలికింది.