శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 20 జనవరి 2019 (09:08 IST)

పీకల వరకు మందుకొట్టి తాళికట్టబోయిన వరుడు.. ఛీపో అన్న యువతి.....

మరికొన్ని క్షణాల్లో ముహూర్తం. అప్పటివరకు బాగానే ఉన్న వరుడు... తాళికట్టబోయే సమయానికి పీకల వరకు మద్యం సేవించాడు. ఈ మద్యం మత్తులోనే వధువు మెడలో మూడు ముళ్లు వేసేందుకు సిద్ధపడ్డాడు. వరుడు మద్యం సేవించిన విషయాన్ని పసిగట్టిన యువతి.. పెళ్లి పీటలపై నుంచి లేచి.. ఛీపో.. అంటూ చీదరించింది. తాళి కట్టించుకునేందుకు ససేమిరా అంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో జరిగింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వచ్చి వరుడుతో పాటు అతని తండ్రిని కూడా అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బీహార్ రాష్ట్రంలని భాగల్‌పూర్‌లోని తిలక్‌పూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి అదే ఊరికి చెందిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఈ పెళ్లి కోసం భారీగానే ఏర్పాట్లు చేశారు. తీరా ముహూర్తం సమయానికి తాను పెళ్లి కొడుకును అన్న గర్వమో, స్నేహితులు కోరారో తెలియదు కానీ వరుడు మాత్రం పూటుగా మందుకొట్టి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. తాళి కట్టే సమయంలో అతను మద్యం తాగివున్నాడని వధువు పసిగట్టింది. 
 
ఇలాంటి వ్యక్తిని తాను పెళ్లి చేసుకోబోనని తెగేసి చెప్పింది. అమ్మాయికి నచ్చజెప్పేందుకు ఇరు కుటుంబాల పెద్దలు యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి పీటలవరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇక్కడే అసలు కొత్త ట్విస్ట్ మొదలైంది. ప్రస్తుతం బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమలు అవుతున్న నేపథ్యంలో మందు తాగినందుకు వరుడితో పాటు అతడి తండ్రిని పోలీసులు ఎక్సైజ్ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇంతకీ వరుడు పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనార్హం.