భారత్ ఇప్పుడే రెండు చేతుల్ని పోగొట్టుకుంది.. సహనం అవసరమా?: కమల్
భారత్ ఇప్పుడే రెండు చేతుల్లాంటి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్లను పోగొట్టుకుందని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. దేశంలో సుస్థిరత సాధించుకోవాలంటే.. అన్ని వర్గాల ప్రజల్ని ఒకరినొకరు అంగీకరించాలని, ఒకరిమీద ఒకరు ‘సహనం’ చూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థులతో జరిగిన ఓ సెమినార్లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా.. వాక్స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, మతం, స్వేచ్ఛ, విద్య తదితర అంశాలపై కమల్ తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించారు.
భారత్ భిన్న సంస్కృతుల సమాహారమని కమల్ స్పష్టం చేశారు. మూడు రంగుల దారాలతో భారతం అనే స్వెట్టర్ను అల్లడం జరిగిందని.. ప్రస్తుతం దాని చేతులు పోయాయని.. మిగిలిన స్లీవ్లెస్ స్వెటర్ లోంచి ఆకుపచ్చని దారాన్ని వేరు చేయడం సాధ్యం కాదన్నారు. తాను సహనం అనే పదానికి వ్యతిరేకమని.. ముస్లింలను మన సహపౌరులుగా అంగీకరించాలి. వారిమీద సహనం చూపించనవసరం లేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా హిందువులనూ అంగీకరించాలి. అప్పుడే దేశం ముందుకెళుతుందని కమల్ హాసన్ చెప్పారు.