1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (11:42 IST)

జయ ప్రియనెచ్చెలికి షాకిచ్చిన ఐటీ శాఖ రూ.300 కోట్ల ఆస్తులు అటాచ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ప్రియనెచ్చెలి, అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు ఆదాయపన్ను శాఖ తేరుకోలేని షాకిచ్చింది. చెన్నైలోని పోయస్ గార్డెన్‌లోని వేద నిలయంకు సమీపంలోని భారీ భవనంతో పాటు.. మొత్తం రూ.300 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది.

ముఖ్యంగా, పోయస్‌గార్డెన్ దగ్గర ఉన్న 10 అంతస్తుల భవనాన్ని కూడా ఐటీ శాఖ అటాచ్ చేసింది. షెల్ కంపెనీలతో శశికళ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు ఆస్తులను అటాచ్ చేశారు. షెల్ కంపెనీలు అంటే బోగస్ కంపెనీల పేరుతో భారీగా అగ్రమాస్తులు సంపాదించినట్టు ఐటీ శాఖ నిర్ధారించింది. ముఖ్యంగా, మార్చి 9, 1995న శశికళ ‘శ్రీ హరి చందన ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఓ బినామీ కంపెనీని తెరపైకి తెచ్చినట్టు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి.
 
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేంద్రంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను ఈ కంపెనీ సాగించినట్లు అధికారులు గుర్తించారు. 2003-05 మధ్య కాలంలో శశికళ 200 ఎకరాలను కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ చెప్పుకొచ్చింది. మొత్తం 65 ఆస్తులను శశికళ కూడబెట్టినట్లు తెలిపింది. బెంగళూరు జైలులో ఉన్న శశికళకు ఐటీశాఖ ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటీసులు పంపింది. 2017లో అక్రమాస్తుల కేసులో శశికళకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే.