శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (09:18 IST)

#JayaTV : జయ టీవీ - దినకరన్‌లకు షాక్.. ఐటీ దాడులు...

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన 'జయ టీవీ'కి ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు షాక్‌ ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున ఐటీ అధికారుల బృందం జయ టీవీ కార్యాలయంలో సోదాలు చేపట్టింది. చెన్నైలోని స్థానిక ఈక్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన 'జయ టీవీ'కి ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు షాక్‌ ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున ఐటీ అధికారుల బృందం జయ టీవీ కార్యాలయంలో సోదాలు చేపట్టింది. చెన్నైలోని స్థానిక ఈక్కాట్టుతాంగల్ ప్రాంతంలో ఉన్న ఈ టీవీ కారయాలయంలో దాడులు కొనసాగాయి. దాదాపు 10మంది ఐటీ అధికారులు జయ చానెల్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
జయలలిత ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం జయటీవీ జైలుపాలైన అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కుటుంబసభ్యుల అధీనంలో ఉంది. శశికళను పార్టీ నుంచి బహిష్కరించి.. ఈపీఎస్‌-ఓపీఎస్‌ శిబిరాలు విలీనమైన నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఈ చానెల్‌ కథనాలు ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో చానెల్‌పై ఐటీ దాడులు జరగడం గమనార్హం.
 
ఆదాయాన్ని దాచిపెట్టడం, పన్ను ఎగవేయడం వంటి సమాచారం ఆధారంగానే చానెల్‌ కార్యాలయంలో దాడులు నిర్వహించినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ‘చానెల్‌ పన్ను ఎగ్గొట్టేందుకు ఆదాయ వివరాలను దాచిపెడుతున్నట్టు మాకు సమాచారం అందింది. చానెల్‌ కార్యకలాపాలు, ముఖ్య సిబ్బంది తీరుపై ప్రస్తుతం దృష్టి పెట్టాం’ అని ఐటీ అధికారులు చెప్పారు.
 
మరోవైపు... చెన్నై, బీసెంట్ నగర్‌లోని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్, తంజావూరులోని అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త ఎం నటరాజన్ నివాసాల్లో కూడా ఏకకాలంలో సోదాలు జరిగాయి. ముఖ్యంగా, స్థానిక బీసెంట్ నగర్‌లోని తన నివాసంలో దినకరన్ ఉన్నపుడే ఐటీ అధికారులు అక్కడకు చేరుకుని సోదాలు చేపట్టారు. శశికళ కుటుంబానికి చెందిన జాజ్‌ సినిమా థియేటర్‌పై, వివేక్‌ నివాసంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.