శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 నవంబరు 2020 (10:46 IST)

కేరళలో ఐయూఎంఎల్ ఎమ్మెల్యే అరెస్టు.. ఎందుకో తెలుసా?

దేశంలో సంచలనం సృష్టించిన కేసుల్లో గోల్డ్ స్కామ్ ఒకటి. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ స్కామ్‌లో తొలుత సీఎం కార్యాలయానికి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, అవన్ని నిరాధారమైన ఆరోపణలన్నీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇదిలావుంటే, ఈ స్కామ్‌లో మంజేశ్వర్ ఎమ్మెల్యే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) నేత ఎంసీ కమరుద్దీన్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. 
 
అరెస్టుకు ముందు ఏఎస్‌పీ వివేక్ కుమార్ సారథ్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎమ్మెల్యేను ఆరు గంటలపాటు విచారించింది. అనంతరం అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈ కేసులో ఆయనను తొలిసారి ప్రశ్నించారు. తమను రూ.36 లక్షల మేర మోసం చేసినట్టు ఆగస్టు 28న ముగ్గురు డిపాజిటర్లు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.
 
ఫ్యాషన్ గోల్డ్ బ్రాండ్ పేరుతో సాగిన ఈ బంగారు వ్యాపారంలో జరిగిన మోసానికి సంబంధించి అప్పటి నుంచి 115 మంది డిపాజిటర్లు కమరుద్దీన్‌పై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై నాన్-బెయిలబుల్ నేరం కింద కేసులు నమోదు చేశారు. 
 
కేసు విచారణ సందర్భంగా మొత్తం 77 మంది ఫిర్యాదుదారుల రూ.33 కోట్ల మోసానికి సంబంధించి అధికారులు ప్రశ్నించారు. అయితే, తొలి మూడు కేసుల్లోనే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆయన రూ.15 కోట్ల మోసానికి పాల్పడినట్టు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఏఎస్పీ తెలిపారు.