మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (11:26 IST)

వేదనిలయంపై సరికొత్త ట్విస్ట్.. శశికళ మరదలు ఇళవరసిపై వీలునామా? ఎవరు రాశారు?

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న దివంగత జయలలితకు అత్యంత ప్రీతిపాత్రమైనవాటిలో పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఒకటి. జయలలిత మరణానంతరం ఈ నివాసం కేంద్రంగా ఇపుడు తమిళనాడు ర

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న దివంగత జయలలితకు అత్యంత ప్రీతిపాత్రమైనవాటిలో పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఒకటి. జయలలిత మరణానంతరం ఈ నివాసం కేంద్రంగా ఇపుడు తమిళనాడు రాజకీయాలు కొనసాగుతున్నాయి. 
 
ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ.పన్నీర్ సెల్వం తన అధికారాన్ని ఉపయోగించి వేద నిలయంను అమ్మా మెమోరియల్‌గా మార్చాలని భావిస్తున్నారు. ఇందుకోసం పన్నీర్ సర్కారు జీవో తయారీలో నిమగ్నమైవున్నట్టు తెలుస్తోంది. అయితే, పన్నీర్ సెల్వం కట్రలను అడ్డుకుంటామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం హెచ్చరికలు చేస్తోంది. ఇదిలావుండగా, తాజాగా ఈ గృహంపై ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 
 
జయలలిత తన ఇంటిని శశికళ మరదలు ఇళవరసికి చెందేలా వీలునామా రాశారన్నది ఆ ట్విస్ట్. పొయెస్‌ గార్డెన్‌ లేదా వేదనిలయాన్ని జయ స్మారకంగా మారుస్తామని పన్నీర్‌ సెల్వం ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. ఆన్‌లైన్‌లో జయ పేరిట ఓ వీలునామా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. వేదనిలయాన్ని ఇళవరసికి చెందేలా వీలునామా రాసినట్లు శశికళ వర్గాలు వెల్లడించాయని తమిళ మీడియాలో ఓ కథనం వచ్చింది. 
 
వీలునామా పత్రాల్లో జయలలిత సంతకం కనిపిస్తోంది. కానీ దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జయ 2016 మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినపుడు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ వేదనిలయం ఆమె పేరిటే ఉంది. కొన్ని రోజుల్లోనే ఆమె వీలునామా రాసి ఉండరని.. చెబుతున్నారు. ఈ వీలునామా నిజమేనని తేలితే పొయెస్‌ గార్డెన్‌ శశికళ కుటుంబానికే దక్కుతుంది.