శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 నవంబరు 2020 (09:16 IST)

కొడుకు పుడతాడని నమ్మించిన భూతవైద్యుడు.. కుమార్తెను బలిచ్చిన తండ్రి!!

మన దేశంతో పాటు ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికీ.. మన దేశంలో మూఢనమ్మకాలు ఇంకా తొలగిపోలేదు. గ్రామీణ ప్రాంతాలు, నగరాలని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ మూఢ నమ్మకాలు బలంగా నాటుకునివున్నాయి. దీన్ని అనేక మంది భూతవైద్యులు క్యాచ్ చేసుకుని చెలామణిలో ఉన్నారు. 
 
ప్రజల అజ్ఞానం, మంత్రగాళ్ల దురాశ.. వెరసి అనేక దారుణాలకు దారితీస్తున్నాయి. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఓ భూతవైద్యుడు చెప్పిన మాటలు నమ్మి ఓ తండ్రి తన కుమార్తెను బలిచ్చాడు. అదీకూడా కొడుకు పుడతాడన్న మూఢ నమ్మకంతో ఈ పని చేశాడు. కానీ, చివరకు ఆ ఇంటి విషాదం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 
 
రాంచీకి చెందిన సుమన్ నాగస్యా ఓ రోజుకూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉంది. కొడుకులు లేరని నిత్యం అసంతృప్తికి గురవుతుండేవాడు. ఈ క్రమంలో సుమన్ నాగస్యా ఓ భూతవైద్యుడిని కలిశాడు. తనకు కొడుకులు లేరన్న విషయం చెప్పి అతడిని సలహా అడిగాడు. అయితే ఆ మంత్రగాడు, కొడుకు పుట్టాలంటే కూతుర్ని బలివ్వాలని చెప్పాడు.
 
అది నిజమేనని నమ్మిన సుమన్ మరేమీ ఆలోచించకుండా ఉన్మాదంతో కూతుర్ని తల నరికి బలిచ్చాడు. ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు కిరాతక తండ్రి సుమన్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భూతవైద్యుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.