శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (14:01 IST)

రెండో భార్యకు ''ట్రిపుల్ తలాక్'' చెప్పిన జడ్జి: సుప్రీంకు లేఖ రాసిన భార్య

నోటి మాటతో, ఫోనులో, సోషల్ మీడియాలో ఒక్క మాట తలాక్ అంటే భార్యాభర్తలు విడిపోవచ్చుననే ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయంపై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ పోరు కొనసాగిస్తోంది. ఈ పోరు కూడా తలాక్ చెప్పిన ఓ జడ్జిపైనే కావడం గమనార్హం. నోటి మాటతో ‘తలాక్’ చెప్పేవారిని కటకటాల వెనక్కి నెట్టాలని సదరు మహిళ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు, అలహాబాదు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మతీన్ అహ్మద్‌లకు ఆమె లేఖ రాశారు. 
 
ఇక వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో అలీగఢ్ జిల్లా అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న మొహ్మద్ జహీరుద్ధీన్ సిద్ధీఖీ.. మొదటి భార్య మరణించగా, 2015 ఆగస్టు 16న అష్ఫా ఖాన్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. అట్టహాసంగా వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి తొలి భార్య ద్వారా కలిగిన కుమారులు కూడా హాజరు కావడం గమనార్హం. అయితే తాజాగా అష్పా ఖాన్‌పై ఒకానొక సందర్భంలో అంతెత్తున ఎగిరిపడ్డ సిద్ధీఖీ మూడు సార్లు ‘తలాక్’ చెప్పేశారట. 
 
అంతేకాక ‘తలాక్’ చెప్పనంటున్న ఆమెను ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారట. దీంతో తనకు న్యాయం చేయాలని అష్ఫా ఖాన్ సీజేఐతో పాటు అలహాబాదు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖలు రాశారు. తనకు తలాక్ చెప్పిన సిద్ధీఖీ, ఆయన కుటుంబ సభ్యులు తనపై హింసకు కూడా దిగారని కూడా ఆ లేఖలో అష్ఫా ఖాన్ ఫిర్యాదు చేసింది. మరి ఈ ఘటనపై అత్యున్నత న్యాయ స్థానం ఏమేరకు స్పందిస్తుందో వేచిచూడాలి.