బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 మే 2017 (09:55 IST)

సుప్రీం సీజేతో పాటు.. ఏడుగురు న్యాయమూర్తులకు జైలుశిక్ష.. రూ.లక్ష జరిమానా : జస్టీస్ కర్ణన్ తీర్పు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఏడుగురు న్యాయమూర్తులకు జైలుశిక్ష విధిస్తూ కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ తీర్పునిచ్చారు. వీరికి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఐదేళ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఏడుగురు న్యాయమూర్తులకు జైలుశిక్ష విధిస్తూ కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ తీర్పునిచ్చారు. వీరికి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అలాగే, ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున జరిమానా కూడా విధించారు. ఈ మొత్తాన్ని వారం రోజుల్లోగా ఢిల్లీలోని 'నేషనల్‌ కమిషన్‌, షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ అండ్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ కాన్‌స్టిట్యూషనల్‌ బాడీ'కి చెల్లించకుంటే మరో ఆరునెలలు శిక్ష విధించాలని ఆదేశించారు. 
 
వివాదాస్పద వ్యాఖ్యలు, ఆదేశాలతో తరచుగా సంచలనం సృష్టిస్తున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌.. తాజాగా సోమవారం సాయంత్రం జారీచేసిన సంచలన ఆదేశాలివి. తన మానసిక ఆరోగ్యంపై వైద్యపరీక్షలు చేయించాలంటూ ఆదేశాలు జారీ చేసిన ఏడుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనంలోని చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ పినాకీ చంద్రఘోష్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లతోపాటు, జస్టిస్‌ భానుమతికి కూడా.. తన విధులను అడ్డుకున్నారనే ఆరోపణలతో జస్టిస్‌ కర్ణన్‌ ఈ శిక్ష విధించారు. 
 
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద శిక్షార్హమైన నేరానికి వీరందరూ కలిసికట్టుగా పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. వారంతా తమ అధికారాలను ఉపయోగించి దళిత న్యాయమూర్తినైన తనను అవమానించారని, వేధించారని అన్నారు. వారికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొనసాగే అర్హత లేదన్నారు. అలాగే సుప్రీం ధర్మాసనం తనకు రూ.14 కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఏప్రిల్‌ 13న ఇచ్చిన ఆదేశాలను ఇంతవరకూ పాటించనే లేదని, ఇప్పటికైనా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆ సొమ్మును ధర్మాసనంలోని ఏడుగురు న్యాయమూర్తుల జీతాల నుంచి సేకరించి తన ఖాతాలో వేయాలని ఆదేశించి సంచలనం రేపారు.