గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (13:52 IST)

మధ్యప్రదేశ్ రాజకీయం : బలపరీక్షకు ముందే కమల్‌నాథ్ ఔట్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన బలాన్ని నిరూపించుకోవాల్సివుంది. కానీ, అప్పటివరకు ఆగకుండానే ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్‌కు కమల్‌నాథ్ శుక్రవారం మధ్యాహ్నం సమర్పించారు. దీంతో 15 యేళ్ల తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 15 నెలలకే కుప్పకూలిపోయింది. 
 
కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ మెజారిటీని కోల్పోయింది. దీంతో ముఖ్యమంత్రి కమల్ నాథ్ బలపరీక్ష ఎదుర్కోక ముందే రాజీనామా చేసేశారు. 
 
అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మెజార్టీ స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి బీజేపీ తమకు వ్యతిరేకంగా పని చేసింది. 
 
మధ్యప్రదేశ్‌ ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందన్నారు. ప్రజా తీర్పును బీజేపీ అవమానించింది. బీజేపీ పాలనలో మాఫియా రాజ్యమేలుతోందన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా పని చేయడం బీజేపీకి నచ్చలేదు అని కమల్‌ నాథ్‌ పేర్కొన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ద్రోహం చేశారు. తమ ఎమ్మెల్యేలను కర్ణాటకలో నిర్బంధించారు అని కమల్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
15 నెలల పాలనలో మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి చేశాను. సమర్థవంతంగా ప్రజలకు పాలన అందించామని తెలిపారు. బీజేపీ 15 సంవత్సరాల్లో చేయలేనిది.. తాను 15 నెలల్లో చేసి చూపించాను అని స్పష్టం చేశారు. రైతులు తమపై ఎంతో విశ్వాసం ఉంచారు.  వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేశాం.. 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని కమల్‌నాథ్‌ గుర్తుచేశారు.