శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (16:51 IST)

సనావుల్లా విదేశీయుడు కాదు... కార్గిల్ వీరుడు కేసు సుఖాంతం

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన భారత సైనికుడు మహమ్మద్ సనావుల్లా. ఈయన భారత ఆర్మీలో 30 యేళ్ల పాటు సుబేదారుగా పనిచేశారు. 57 యేళ్ల అస్సాం వాసి మన భారతీయుడు కాదంటూ ఆరోపణలు వచ్చాయి. పైగా, విదేశీయుడు అనే ముద్రవేశారు. ఈ ముద్ర ఇపుడు తొలగిపోయింది. ఫలితంగా ఈ కార్గిల్ వీరుడు కథ సుఖాంతమైంది. 
 
సనావుల్లాను 1946 నాటి ఫారినర్ చట్టం కింద అదుపులోకి తీసుకుని నిర్బంధ శిబిరానికి పంపారు. విదేశీయులనో, అక్రమ వలసదారులనో ఇలా నిర్బంధ శిబిరాలకు పంపుతుంటారు. తాను భారతీయుడినేనని సనావుల్లా నిరూపించుకోలేకపోయాడట. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈయన సమర్పించిన డాక్యుమెంట్లను, అతని స్టేట్మెంట్‌ను తనిఖీ చేసిన రిటైర్డ్ ఎస్ఐ చంద్రమాల్ దాస్ తన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టును తప్పుడు ఫోర్జరీలతో పంపాడని వెల్లడైంది. 
 
దీంతో దాస్‌పై మూడు వేర్వేరు ఎఫ్‌ఐ‌ఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. సనావుల్లా తన స్టేట్మెంట్‌లో సాక్షులుగా పేర్కొన్న ముగ్గురు వ్యక్తులు దాస్‌పై ఖాకీలకు ఫిర్యాదు చేశారు. ఆయన తమ సంతకాలను ఫోర్జరీ చేశాడని, కావాలనే సనావుల్లాను ఇబ్బంది పెట్టాడని వారు ఆరోపించారు. సనావుల్లా బంగ్లాదేశ్ వాసి కాదు.. ఈ దేశంలో పుట్టిన భారతీయుడు అని వారు స్పష్టం చేశారు. అస్సాం బార్డర్ పోలీసులు ఆయనను ఎంతో వేధించారని కూడా వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజా పరిణామాలతో సనావుల్లా డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల కానున్నాడు.