శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (14:11 IST)

తాగుబోతు తల్లి కోసం భిక్షగత్తెగా మారిన చిన్నారి...సీఎం దృష్టికి...

ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. తల్లి మద్యానికి బానిస. దీంతో అనారోగ్యంబారినపడిన తల్లి ప్రాణాలు రక్షించుకునేందుకు ఆ చిన్నారి భిక్షగత్తెగా మారి శక్తిమేరకు కృషి చేస్తోంది. ఈ దృశ్యం కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాల్ జిల్లాలో కనిపించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన దుర్గమ్మ అనే మహిళకు భాగ్యశ్రీ అనే ఆరేళ్ళ పాపవుంది. దుర్గమ్మ మద్యానికి బానిసైంది. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికిగురైంది. భార్య వేధింపులను తట్టుకోలేని ఆమె భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయి మరో వివాహం చేసుకున్నాడు. ఆరేళ్ళ పాప ఉన్నప్పటికీ దుర్గమ్మలో ఎలాంటి మార్పురాలేదు. దీంతో బంధువులు ఎవరూ కూడా ఆమెను పట్టించుకోవడం మానేశారు. చివరకు తన వద్ద ఉండే ఆరేళ్ళ కుమార్తె దుర్గమ్మకు దిక్కు అయింది. 
 
తీవ్ర అనారోగ్యానికి గురైన దుర్గమ్మకు అన్నం తినిపించడం, స్నానం చేయించడం ఇలా సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకోసాగింది. అయితే తల్లి దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో.. ఆస్పత్రికి వచ్చిన వారికి తన దీనస్థితి గురించి చెబుతూ యాచించడం మొదలుపెట్టింది. 
 
ఈ నేపథ్యంలో చిన్నారిని గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది. భాగ్యశ్రీ, ఆమె తల్లి దుర్గమ్మ గురించి పూర్తి వివరాలు సంపాదించి, వారికి సహాయం చేయాల్సిందిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో దుర్గమ్మకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు భాగ్యశ్రీని బడిలో చేర్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.