గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (11:59 IST)

ముగ్గురు పిల్లల తల్లి.. ప్రియుడుతో కలిసి భర్తను చంపేసింది.. ఆపై ఏఎస్ఐతో లింకు..

ప్రియుడుపై మోజుపడిన ముగ్గురు పిల్లల తల్లి అత్యంత దారుణంగా నడుచుకుంది. ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తను చంపేసింది. ఆపై చేసిన తప్పు బయటపడకుండా ఉండేందుకు ఓ ఏఎస్ఐతో అక్రమసంబంధం పెట్టుంది. అయితే, మూడేళ్ళ తర్వాత ఆమె పాపం పండింది. ఫలితంగా ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లా పరిధిలోని కోళ్లేగాల సమీపంలో రంగాస్వామి అనే వ్యక్తి టిప్పర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు రూప అనే మహిళతో పెళ్లి జరుగగా, వీరికి ముగ్గురు పిల్లలు. వీరంతా దాజెనగౌడన గొడ్డి గ్రామంలో నివశిస్తున్నారు. 
 
ఈ క్రమంలో రంగాస్వామితో పాటు టిప్పర్ డ్రైవర్‌గా ముద్దెగౌడ పని చేస్తున్నాడు. రంగాస్వామితో కలిసి తరుచూ ముద్దెగౌడ ఇంటికి వచ్చివెళ్ళేవాడు. ఈ క్రమంలో రంగాస్వామి భార్య రూపతో చనువు ఏర్పడింది. ఈ చనువు కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న రంగస్వామి, తన భార్యను మందలించడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని నిర్ణయించుకుని ప్రియుని సహకారాన్ని కోరింది. ఇందుకోసం వారిద్దరూ కలిసి పక్కా ప్లాన్ వేశారు. 
 
తమ పథకంలో భాగంగా, 2017, జూలై 4వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రపోతున్న భర్త తలపై బలంగా కొట్టి, హత్య చేసి, దొడ్డి చెరువు వద్ద, మట్టి కోసం తవ్విన గుంతలో పూడ్చి పెట్టారు. ఆపై తన భర్త కనిపించడం లేదని రూప, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.
 
పోలీసులు విచారించినా నిజం బయటకు రాలేదు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత, రూప, ముద్దెగౌడల సంబంధం, వారిద్దరూ కలిసే ఉంటున్నారని గమనించిన రంగస్వామి సోదరి, మరోసారి పోలీసులను ఆశ్రయించింది. 
 
రూప, ఆమె ప్రియుడిపై అనుమానాన్ని వ్యక్తం చేయడంతో, పోలీసులు ఇద్దరినీ మరోసారి గట్టిగా ప్రశ్నించగా, నిజం బయట పడింది. వారిద్దరినీ తీసుకెళ్లి, మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం అవశేషాలను తరలించారు.
 
అయితే, ఈ కేసు ఇక్కడే మలుపుతిరిగింది. రూపపై స్థానిక పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న ఓ ఏఎస్ఐకి హత్య జరిగిన సమయంలోనే అనుమానం రాగా, నిజం బయటకు రాకుండా ఉండేందుకు అతన్ని బుట్టలో వేసుకుంది. అతనితో కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. 
 
తాజాగా, మొత్తం వ్యవహారం బయటకు రావడంతో, జిల్లా ఎస్పీ స్పందించారు. ఏఎస్ఐ సిద్దరాజుపై కేసు పెట్టి, విచారించాలని ఆదేశించారు. కేసు బయటకు రాకుండా చూసేందుకు సిద్దరాజు తనను శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. మొత్తంమీద రూప పాపంపండటంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది.