1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (13:42 IST)

హెరిటేజ్ ప్లాంట్‌లో కలకలం... ఢిల్లీలో ముగ్గురు విలేకరులకు పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పారిశ్రామికవాడలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంట్లో కలకలం చెలరేగింది. ఇక్కడ పని చేస్తున్న 34 మంది సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఈ ప్లాంట్‌లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇక్కడ పనిచేసేవారందరినీ క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. 
 
ఈ ప్లాంట్‌లో పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డుకు అతని తండ్రి నుంచి కరోనా వైరస్‌ సోకింది. అయితే, ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా నిర్వాహకులు గోప్యత పాటించారు. అతనితో కాంటక్ట్‌ అయిన 33 మందిని గుర్తించి రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచారు.  దీనిపై  స్థానికులు ఫిర్యాదు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్లాంట్‌ దగ్గరకు వచ్చారు. మొత్తం 34 మంది అనుమానితులను క్వారంటైన్‌కు పంపించారు.
 
మరోవైపు, దేశంలోని పలు రాష్ట్రాల్లో విలేకరులు కరోనా వైరస్ బారినపడుతున్నారు. ముంబై, చెన్నైలలో అనేక మంది జర్నలిస్టులు ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, ఢిల్లీలోకూడా ఉన్నారు. ఇదే విషయంపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, ఢిల్లీలో 529 మంది మీడియా ప్రతినిధులకు పరీక్షలు చేయగా.. కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ అని తేలిందని చెప్పారు. 
 
జర్నలిస్టులందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల పాత్రికేయుల పని చాలా ముఖ్యమైనదని అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పారు.