1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 12 అక్టోబరు 2020 (11:58 IST)

కాంగ్రెస్‌కు టాటా చెప్పిన సినీ నటీ ఖుష్బూ, నేడు బీజేపీ లోకి రంగ ప్రవేశమా?

తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. దక్షణాదిలో ప్రముఖ నటి అయిన ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె 2014 నుండి ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిన్నటి వరకు ఆ పార్టీ  అధికార ప్రతినిధిగా కొనసాగారు. అయితే 2014 నుండి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
 
కాంగ్రెస్ బలం అంతంతమాత్రమే అయిన తమిళనాడులో ఖుష్బూ నిర్ణయం సంచలనంగా మారింది. 2019 ఎన్నికల్లో డిఎంకే కాంగ్రెస్ పార్టీ పొత్తు నేపథ్యంలో లోక్‌సభ టిక్కెట్ ఆశించిన ఖుష్బుకు నిరాశే ఎదురైంది. పొత్తులో భాగంగా ఆమెకు ఇస్తారన్న టికెట్‌ను డిఎంకే ఎగరేసుకుపోయింది. అయితే రాజ్యసభకు పంపిస్తామని అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
 
కానీ ఆ ముచ్చట తీరలేదు. ఆ క్రమంలో ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యావిధానాన్ని ఖుష్బూ సమర్థించారు. దీంతో ఖుష్బూ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇక ఆదివారం కాంగ్రెస్ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఖుష్బూ ప్రకటించారు.
 
ఇదిలావుండగా 2021లో రానున్న తమిళనాడు అసెంబ్లీ న్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఖుష్బూ ఈ రోజు మధ్యాహ్నం బీజేపీలో చేరబోతున్నారని బహిరంగ ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఆమె ఖండించలేదు. ఒకవేళ ఖుష్బూ కనుక బీజేపీలో చేరినట్లయితే తమిళనాడులో ఆ పార్టీకి కొత్త గ్లామర్ వచ్చినట్లే అని చెప్పవచ్చు.