శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (10:49 IST)

బ్రిటన్ ప్రధాని హత్యే లక్ష్యంగా.. లండన్‌లో ఉగ్రదాడి జరిగిందా?

బ్రిటన్ రాజధాని లండన్‌లో ఓ ఉగ్రవాది దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ పార్లమెంట్‌ను లక్ష్యంగా చేసుకొని ఓ ఆగంతకుడు దాడికి తెగబడ్డాడు. ఆ సమయంలో ప్రధాని థెరిసా మే పార్లమెంట్‌లోనే ఉన్నారు.

బ్రిటన్ రాజధాని లండన్‌లో ఓ ఉగ్రవాది దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ పార్లమెంట్‌ను లక్ష్యంగా చేసుకొని ఓ ఆగంతకుడు దాడికి తెగబడ్డాడు. ఆ సమయంలో ప్రధాని థెరిసా మే పార్లమెంట్‌లోనే ఉన్నారు. ఆమెను హత్య చేసేందుకే ఆ ఉగ్రవాది దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
 
అసలు ఈ దాడి జరిగిందన్న విషయాన్ని పరిశీలిస్తే.. పార్లమెంట్ సమావేశాలు వాడివేడీగా జరుగుతున్నాయి. బుధవారం.. సమయం మధ్యాహ్నం 2 గంటలు.. నిందితుడు అబూ ఇజాదీన్ కారులో బ్రిటన్‌ పార్లమెంట్ వైపు బయలుదేరాడు.
 
జెట్ స్పీడ్ వేగంతో కారు నడుపుతూ వెస్ట్‌ మినిస్టర్‌ వంతెనపై వెళుతున్న పాదచారులను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. వంతెన రెయిలింగ్‌ను ఢీకొని కారు కూడా ఆగిపోయింది. ఆ వెంటనే అబూ ఇజాదీన్‌ పార్లమెంట్ వైపు పరుగులు తీశాడు.
 
అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. అతడి చేతిలో ఓ కత్తి ఉంది. భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు.. చివరకు ఓ పోలీసు అధికారిపై కత్తితో దాడి చేశాడు. లొంగిపోవాల్సిందిగా భద్రతా సిబ్బంది హెచ్చరించినా అబూ పట్టించుకోలేదు. చివరకు పోలీసులు అతడిని కాల్చి చంపారు. అబూ చేతిలో గాయపడిన పోలీసు అధికారి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి చెందారు.
 
దాడి జరిగిన సమయంలో బ్రిటన్‌ ప్రధాని పార్లమెంట్‌లో ఉన్నారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ముగించుకుని ఆమె కారు ఎక్కుతున్న సమయంలో దాడి జరిగింది. దీంతో ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో పార్లమెంట్‌కు వచ్చేదారులను తాత్కాలికంగా మూసి వేశారు. లోపలున్న ఎంపీలెవరినీ బయటికి రానివ్వలేదు.