గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 జులై 2018 (08:54 IST)

ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేసిన ఎర్రటి జాబిలి...

శుక్రవారం రాత్రి ఆకాశంలో అద్భుతం కనిపించింది. ఎప్పుడూ తెల్లగా కనిపించే జాబిలి శుక్రవారం రాత్రి మాత్రం ఎర్రటి వర్ణంలో కనిపించి కనువిందు చేసింది. ఈ శతాబ్దిలోనే సుదీర్ఘం చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి కనిప

శుక్రవారం రాత్రి ఆకాశంలో అద్భుతం కనిపించింది. ఎప్పుడూ తెల్లగా కనిపించే జాబిలి శుక్రవారం రాత్రి మాత్రం ఎర్రటి వర్ణంలో కనిపించి కనువిందు చేసింది. ఈ శతాబ్దిలోనే సుదీర్ఘం చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి కనిపించిన విషయం తెల్సిందే.
 
శుక్రవారం ఒక్కరోజే.. సుదీర్ఘ చంద్రగ్రహణం… ఎర్రటి చంద్రుడు… రెండు అద్భుతాలు జరిగాయి. చంద్రగ్రహణం తర్వాత.. చంద్రుడు ఎరుపు రంగులోకి మారిపోయాడు. 103 నిమిషాల పాటు రెడ్‌ మూన్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. సూర్యుడు చంద్రుడికి మధ్య భూమి రావడంతో చంద్రగ్రహణం ఏర్పడింది. భూమి వాతావరణం పైనుంచి వెళ్లే కాంతి కారణంగా చంద్రుడు ఎరుపు రంగులోకి మారిపోయాడు. 
 
అంగారకుడు భూమికి దగ్గరగా రావడం.. ఈ చంద్రగ్రహణం మరో ప్రత్యేకత. గ్రహణం మన దేశంలో శుక్రవారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు మొదలై.. శనివారం వేకువజామున 4 గంటల 59 నిమిషాలకు ముగిసింది. రాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల 43 గంటల మధ్య చంద్రగ్రహణం పరిపూర్ణంగా కనిపించింది. ఈ సమయంలోనే బ్లడ్ మూన్ కనువిందు చేసింది. 
 
హైదరాబాద్‌లో ఆకాశం మబ్బులు పట్టి ఉండటంతో బ్లడ్ మూన్ ఎక్కువగా కనిపించలేదు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఎర్రని చంద్రుడు అలరించాడు. రెడ్ మూన్ చూస్తూ రాత్రంతా జనం రోడ్లపై జాగారం చేశారు. ప్లానెటోరియాల దగ్గర టెలిస్కోప్‌లు పెట్టి చూపించడంతో.. పిల్లలు, యువత ఎంజాయ్ చేశారు. 
 
గ్రహణ సమయం పూర్తి కాగానే ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహించి తలుపులు తీశారు. తర్వాత భక్తుల దర్శనానికి అనుమతించారు. ఉత్తరాదిన గంగా, ప్రయాగ, వారణాసి ప్రాంతాల్లో నదీ జలాల్లో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. గ్రహణంపై మూఢ నమ్మకాలు పోగొట్టేందుకు కొందరు సామూహిక భోజనాలు ఏర్పాటు చేయడం గమనార్హం.