శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జులై 2020 (13:45 IST)

తనకు దూరమయ్యాడనీ... విషమిచ్చి జడ్జిని చంపేసిన మహిళ

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ దారుణ చర్యకు పాల్పడింది. తనకు దూరమయ్యాడని ఓ మహిళ విషమిచ్చి జడ్జిని చంపేసింది. ఈ ఘటనలో జడ్జితో పాటు.. అతని కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహేంద్ర త్రిపాఠీ అనే న్యాయమూర్తి కొంతకాలం కిందట చింద్వారాలో పనిచేశారు. ఆ సమయంలో ఆయనకు సంధ్యా సింగ్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈమె ఓ ఎన్జీవో సంస్థను నడుపుతూ వచ్చింది. 
 
ఈ క్రమంలో మహేంద్ర త్రిపాఠీ, సంధ్యా సింగ్ ల స్నేహం హద్దులు దాటింది. ఈ క్రమంలో జడ్జి మహేంద్ర త్రిపాఠీకి బేతుల్ జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జీగా బదిలీ అయింది. ఫలితంగా సంధ్యా సింగ్‌కు దూరమవుతూ, తన కుటుంబ సభ్యులతో కలిసి బేతుల్ జిల్లాకు బదిలీ అయ్యారు. 
 
అయితే సంధ్యా సింగ్ ఈ పరిణామాలతో తీవ్ర అసహనంతో రగిలిపోయింది. జడ్జి మహేంద్ర త్రిపాఠీ తనతో సంబంధం కొనసాగింపుకు మొగ్గు చూపకపోవడంతో సంధ్యా సింగ్ ఓ విషపు ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 
 
మహేంద్ర త్రిపాఠీ కుటుంబాన్ని తుదముట్టించాలని ప్లాన్ చేసి అమల్లో పెట్టింది. త్రిపాఠీ కుటుంబ సమస్యలను తన కుట్రకు అనుకూలంగా మలుచుకుంది. సమస్యలన్నీ తొలగిపోయేందుకు ఓ ప్రత్యేక పూజ చేస్తానని, తాను చేసిన మంత్ర చపాతీలను తింటే మేలు జరుగుతుందని త్రిపాఠీని నమ్మించింది.
 
నిజమేనని నమ్మిని జడ్జి త్రిపాఠీ గోధుమ పిండి తెచ్చివ్వగా, దాంట్లో విషం కలిపి అతడి కుటుంబ సభ్యులతో తినిపించింది. త్రిపాఠీ, అతని పెద్ద కుమారుడు మాత్రమే ఆ చపాతీలు తినగా, భార్య, చిన్నకుమారుడు తినలేదు. 
 
ఆ చపాతీల్లో విషం ఉండడంతో జడ్జి, ఆయన కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తమను ఆసుపత్రిలో చేర్చే సమయంలో జడ్జి చపాతీల చిన్న కుమారుడితో చెప్పడంతో సంధ్యా సింగ్‌పై అనుమానం కలిగింది. ఆమెను అరెస్ట్ చేసి విచారించడంతో కుట్ర బట్టబయలైంది. ఈ వ్యవహారంలో సంధ్యాసింగ్‌తో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.