డ్యాం బిల్డింగ్ కాంట్రాక్టు నిబంధనలకు తిలోదకాలిచ్చిన పంకజ ముండే!
మహారాష్ట్ర మహిళా మంత్రి పంకజ ముండేపై తాజాగా కొత్తరకం అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రైవేటు కంపెనీకి డ్యాం బిల్డింగ్ నిర్మాణ కాంట్రాక్ట్ ఇచ్చే విషయంలో మంత్రి నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న ఆమె... ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల ఆహార పదార్థాలు, పుస్తకాలు, వాటర్ పిల్టర్ల కొనుగోలులో రూ.200 కోట్ల స్కాం గురించి గతవారం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరో విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం. జాల్నా జిల్లాలో చిన్న ఆనకట్టలు నిర్మించేందుకు పారిశ్రామికవేత్త రత్నాకర్ గుట్టే నేతృత్వంలోని ఓ ప్రైవేటు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు ఆ నిర్మాణాలకు అత్యల్పంగా ఈ కంపెనీ బిడ్ వేసింది. దీంతో ఈ కంపెనీ అనర్హతకు గురైంది.
ఈ నేపథ్యంలో పంకజ ముండే చక్రం తిప్పి ఆ కంపెనీకే తాజాగా కాంట్రాక్టును కట్టబెట్టారు. దీంతో ఆమె తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ముండే తిరస్కరించారు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆమె ఆరోపించారు.